కూప్పకూలిన భవనాలు.. 15 మంది దుర్మరణం..!
By అంజి Published on 2 Dec 2019 4:31 AM GMTముఖ్యాంశాలు
- కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం
- ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు భవనాలు
- 15 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
- భవన శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్ట సమాచారం
తమిళనాడులో ఘరో ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నాలుగు భవనాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపుగా 15 మంది మృత్యువాత పడ్డారు. కూలిన భవన శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్టు సమాచారం. పలువురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని దగ్గరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఎంత మంది మృతి చెందారన్నదానిపై ఇంకా అధికారులు సృష్టతనివ్వలేదు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు భవనాల్లో ఉన్నవారందరూ నిద్రలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గత రెండు మూడు రోజులుగా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. ఐదు జిల్లాలు జలదిగ్భందనంలో చిక్కుకోవడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. చెన్నై, కడలూరు, మదురై, కాంచీపురం, కోయంబత్తూరుతో పాటు పలు ప్రాంతాల్లో శనివారం నుంచి వర్షం కురుస్తోంది. కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో, భవనాల్లో కాని ఉండరాదని అక్కడి ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు చేశారు.