Hyderabad: నాలాలో పడి మహిళ మృతి

గణేశ్‌ నిమజ్జనం రోజున సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  28 Sep 2023 4:00 PM GMT
Woman, Death, Hyderabad, rain,  nala,

Hyderabad: నాలాలో పడి మహిళ మృతి

గణేశ్‌ నిమజ్జనం రోజున సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామునే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం నాలాలో పడి మహిళ మృత్యువాత పడింది. శోభాయాత్ర రోజుల ఇలాంటి విషాద సంఘటనలు చోటుచేసుకోవడంతో ఆ కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

శోభాయాత్ర సందర్భంగా గణేశ్‌ నిమజ్జనాల కోసం హైదరాబాద్‌ నగరం నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్‌కు విగ్రహాలు తరలివెళ్తున్న సమయంలోనే వర్షం పడింది. దాంతో.. నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. భక్తులు తమ గణనాథులను తరలించేందుకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా.. వర్షంలోనే కొందరు గణేశుడిని నిమజ్జనం చేసేందుకు ముందుకు సాగారు. ఇక శోభాయాత్రలో గణనాథులను చూసేందుకు వచ్చిన జనాలు మాత్రం కాస్త ఇబ్బందులు పడ్డారు. దుకాణాలు అన్నీ మూసి ఉండటంతో ఎటు పరుగెత్తాలో తెలియక వానలోనే తడిచిపోయారు.

ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా సికింద్రాబాద్లోని మెట్టుగూడ నాళాలో మహిళ పడి కొట్టుకుపోయింది. మెట్టుగూడా నాళాలో వరద నీరు భారీగా చేరడంతో ప్రవాహం ఉధృతం అయ్యింది. దాంతో.. ఒక మహిళా బ్రిడ్జి కింద నుండి వెళ్లే ప్రయత్నం చేసింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆమె ఒక్కసారిగా అదుపుతప్పి నాలాలో పడి కొట్టుకుపోయింది. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. అంబానగర్ వద్ద మృతదేహం తేలియాడుతుండగా పోలీసులు గమనించి వెలికి తీశారు. సదరు మహిళ జీహెచ్‌ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చిలకలగూడ పోలీసులు మృతదేహాన్ని వెంటనే గాంధీ మార్చరికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. గణేశ్‌ శోభాయాత్ర రోజున మహిళ చనిపోవడం ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Next Story