'ఈ పాఠశాలకు రాత్రి 12 గంటలకు ఎవరు వచ్చినా చనిపోతారు'.. అక్కడే దంపతుల మృతదేహాలు
Whoever comes to this school at 12 o'clock will die.ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యాలోని 'ఎస్జిఎస్ ఇంటర్
By M.S.R Published on 20 Jan 2022 12:12 PM IST
ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యాలోని 'ఎస్జిఎస్ ఇంటర్ కాలేజీ' మేనేజర్, అతని భార్యను కాలేజీ క్యాంపస్లోని వారి నివాసంలో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. భార్యాభర్తల మృతదేహాలు ఉన్న గది కిటికీలో 'ఈ పాఠశాలకు రాత్రి 12 గంటలకు ఎవరు వచ్చినా చనిపోతారు' అని రాయబడి ఉంది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ దంపతుల కుమారుడు కూడా ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందినట్లు సమాచారం. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
82 ఏళ్ల మేనేజర్ గందర్భ్ సింగ్ యాదవ్, అతని 78 ఏళ్ల భార్య కమలా దేవి కళాశాల క్యాంపస్లోని నివాసంలో నివసిస్తూ ఉండేవాళ్లు. తీవ్రమైన చలి కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి. రెండు రోజుల తర్వాత బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు జితేంద్రకుమార్ మేనేజర్ నివాసం తలుపు తట్టినా లోపల నుంచి స్పందన రాలేదు. చాలా సేపటికి తలుపులు తెరుచుకోకపోవడంతో జితేంద్ర కుమార్కి ఏదో అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మేనేజర్ నివాసం వెనుక వైపు ఉన్న చిన్న తలుపు తెరిచి ఉండడాన్ని గమనించారు.
పోలీసులు నివాసం లోపలికి చేరుకుని మేనేజర్, అతని భార్య మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ జంట హత్యపై వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని అక్కడికి పిలిపించి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. 'ఈ పాఠశాలకు రాత్రి 12 గంటలకు ఎవరు వచ్చినా చనిపోతారు' అని రాసి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల క్రితం మేనేజర్ కుమారుడు శ్రీకాంత్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారుడితో కలిసి జమ్మూకశ్మీర్లో నివసిస్తోంది. మేనేజర్ చిన్న కొడుకు ఢిల్లీలో ఇంజనీర్. ఈ హత్య కేసులో పాఠశాలకు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.