విశాఖపట్నంలోని ఎల్.వి. నగర్లో ఒక నేవీ ఉద్యోగి తన స్నేహితురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర (35) నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తూ విశాఖలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. నెల రోజుల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లడంతో, ఆదివారం రాత్రి తన పాత పరిచయస్తురాలైన మౌనిక (29)ను ఇంటికి పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన గొడవ వికటించి, ఆమెను కిరాతకంగా హతమార్చాడు.
హత్య అనంతరం నిందితుడు మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వాటిని రెండు మూటల్లో కట్టి ఫ్రిజ్లో దాచిపెట్టాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి తనిఖీ చేయగా, ఫ్రిజ్లో శరీర భాగాలు లభ్యమయ్యాయి. అయితే తల భాగం ఇంకా లభ్యం కాలేదని సమాచారం. సదరు యువతి తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ మానసిక హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రవీంద్ర పోలీసుల విచారణలో తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.