నటి అనసూయ భరద్వాజ్పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, ఆమె ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్లు పెడుతున్నారని, తన గౌరవానికి భంగం కలిగిస్తున్నారని అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు జనార్ధన్ (29), హైదరాబాద్ ఇందిరానగర్ నివాసి (కడప జిల్లాకు చెందిన వ్యక్తి). ఇతను @mmtt_official అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్నాడు. అనసూయను లక్ష్యంగా చేసుకుని AI సాంకేతికతతో సృష్టించిన ఒక నకిలీ వీడియోను ఇతను సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టం సెక్షన్ 66E, 67 కింద ఇతనిపై కేసు నమోదు చేశారు.
మరో నిందితుడైన ఆటో డ్రైవర్ కొండాపురం అరుణ్ కుమార్, సికింద్రాబాద్ నివాసి. ఇతను వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. యూట్యూబ్లో అనసూయకు సంబంధించిన ఒక రీల్ చూసిన తర్వాత, తన మొబైల్ ఫోన్ నుండి అత్యంత అసభ్యకరమైన రీతిలో కామెంట్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మార్చి 12న ఇతడిని అరెస్ట్ చేసి, మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
పోలీసుల హెచ్చరిక:
సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా సరే.. ఇతరులను కించపరుస్తూ అభ్యంతరకరమైన పోస్ట్లు పెడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు లేదా సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.