దారుణం.. పసిబిడ్డను చంపి కత్తెరతో కోసుకున్న మహిళ
హర్యానాలోని గురుగ్రామ్లో మనసును కలిచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. భర్తతో ఏర్పడిన చిన్నపాటి వివాదం ఒక పసిప్రాణాన్ని బలితీసుకుంది.
By - అంజి |
దారుణం.. పసిబిడ్డను చంపి కత్తెరతో కోసుకున్న మహిళ
హర్యానాలోని గురుగ్రామ్లో మనసును కలిచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. భర్తతో ఏర్పడిన చిన్నపాటి వివాదం ఒక పసిప్రాణాన్ని బలితీసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన రెండున్నర ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. 30 ఏళ్ల నేహా శర్మకు తన భర్తతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దంపతుల మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ ఆవేశంలో నేహా తన కూతురిని గొంతు పిసికి చంపేసింది. అనంతరం ఇంట్లో ఉన్న కత్తెరతో తనపై తాను గాయాలు చేసుకుని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది. ఉదయం భార్యతో గొడవ పడిన భర్త, యధావిధిగా తన పని నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు.
సాయంత్రం భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా, తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందిన అతను, పొరుగువారి సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లాడు. అక్కడ తన కుమార్తె నిర్జీవంగా పడి ఉండటం, భార్య రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉండటం చూసి షాక్కు గురయ్యాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేహా శర్మపై హత్య కేసు నమోదైంది. కేవలం స్వల్ప వివాదం ఇంతటి పెను విషాదానికి దారితీయడం పట్ల పోలీసులు విచారణ జరుపుతున్నారు.