దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఓ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఖాండ్వా జిల్లాలోని ఒక గ్రామంలో 90 ఏళ్ల వృద్ధురాలిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తన గుడిసెలో ఆ వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో, గురువారం రాత్రి ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు తన కుమార్తెకు సమాచారం అందించడంతో, ఆమె వెంటనే తల్లిని జిల్లా ఆస్పత్రికి తరలించింది.
ఆస్పత్రి సిబ్బంది సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 70 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 10 వేల రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు.