కలిసి చనిపోవాలనుకున్నారు.. ప్రియుడు ఆత్మహత్య, ప్రియురాలు ట్విస్ట్

పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో కలిసి అయినా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే ప్రియురాలు ట్విస్ట్‌ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  3 Feb 2024 2:57 AM GMT
rajasthan, girlfriend, twist,  suicide attempt,

 కలిసి చనిపోవాలనుకున్నారు.. ప్రియుడు ఆత్మహత్య, ప్రియురాలు ట్విస్ట్

వివాహేతర సంబంధాలు ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. ఇలాంటి సంబంధాలే పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో హత్యలకు దారితీస్తున్నాయి. అయితే.. తాజాగా ఓ పెళ్లయిన వ్యక్తి.. యువతిని ప్రేమించాడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ.. వారిని కాదని యువతి వెంటపడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ కుదరకపోవడంతో కలిసి అయినా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడే ప్రియురాలు ట్విస్ట్‌ ఇచ్చింది.

రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో జరిగింది ఈ సంఘటన. రాజ్‌భట్‌ (34) కార్మికుడిగా ఉంటూ.. జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. కొంతకాలం క్రితం రాజ్‌భట్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. రాజ్‌భట్‌ తన భార్య, పిల్లలను వద్దు అనుకుని.. యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దానికి యువతి కూడా ఓకే చెప్పింది. అయితే.. వీరు పెళ్లి చేసుకోవడం కుదరలేదు. పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో.. గత గురువారం మరోసారి పెళ్లి విషయం గురించి మాట్లాడుకున్నారు. కలిసి జీవించలేకపోతున్నామనీ బాధపడ్డారు. ఈ క్రమంలోనే కలిసి చనిపోవాలని అనుకున్నారు. దాంతో.. ఇద్దరూ కలిసి ఖేడ్‌ గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లారు.

గురువారం రాత్రి రైల్వే ట్రాక్‌ వద్దకు చేరుకున్న తర్వాత.. రైలు వస్తోంది. అయితే.. వేగంగా వస్తున్న రైలు కింద పడి రాజ్‌భట్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. కానీ.. యువతి మాత్రం ఆగిపోయింది. చివరి నిమిషంలో భయపడిపోయిన యువతి మనసు మార్చుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక రాజ్‌భట్‌ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. రాజ్‌భట్‌ ఆత్మహత్యకు యువతే కారణమనీ.. అతడిని హత్యచేసిందంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. ఆమెను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story