అమెరికాలో ప్ర‌వాస భార‌తీయురాలి ఆత్మ‌హ‌త్య‌.. ఈ బాధ‌లు భ‌రించ‌లేనంటూ

Punjabi woman dies by suicide in New York.అత్తింటి వారి సూటిపోటి మాట‌లు, ఆడ పిల్ల‌లు పుట్టారంటూ భ‌ర్త వేదింపులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2022 12:59 AM GMT
అమెరికాలో ప్ర‌వాస భార‌తీయురాలి ఆత్మ‌హ‌త్య‌.. ఈ బాధ‌లు భ‌రించ‌లేనంటూ

అత్తింటి వారి సూటిపోటి మాట‌లు, ఆడ పిల్ల‌లు పుట్టారంటూ భ‌ర్త వేదింపులు భ‌రించ‌లేని ఓ ప్ర‌వాస భార‌తీయురాలు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అంత‌క‌ముందే తాను ప‌డుతున్న బాధ‌ల‌ను చెబుతూ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. చనిపోతున్నాను డాడీ నన్ను క్షమించు అంటూ పోస్ట్‌ చేసిన వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. 2015లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన మన్‌దీప్‌ కౌర్​కు (30) రన్‌జోద్‌బీర్‌ సింగ్ తో పెళ్లైంది. ఆ త‌రువాత వీరు అమెరికాలోని న్యూయార్క్‌కు వలస వెళ్లారు. వీరికి 4, 2 ఏళ్ల కుమారైలు సంతానం. కుమార్తెలు జ‌న్మించిన‌ప్ప‌టి నుంచి ర‌న్‌జోద్‌బీర్ సింగ్ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. శారీర‌కంగా హింసించేశాడు. అర్థం చేసుకోని ఆదుకోవాల్సిన అత్తింటి వారు మాన‌సికంగా వేదించేవారు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాలంటూ హింసించేవారని వీడియోలో కౌర్ వాపోయింది. భ‌ర్త దాడుల‌కు సంబంధించిన‌ ప‌లు వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఎనిమిదేళ్లుగా ఈ బాధలను అనుభవిస్తున్నానని ఇక భ‌రించ‌డం త‌న వ‌ల్ల కాద‌ని చెప్పుకొచ్చింది. ఇక‌నైనా భ‌ర్త మారుతాడేమోన‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పింది. అనంత‌రం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మృతురాలి త‌ల్లిదండ్రులు వెల్ల‌డించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కుమార్తె మృత‌దేహాన్ని స్వ‌దేశానికి ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Next Story