రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. ఒక యువకుడిని లిఫ్ట్ అడిగిన రియాజ్ అతను గుర్తుపట్టి పట్టుకోవడానికి ప్రయత్నించడంతో.. అతనిపై కత్తితో దాడికి దిగాడు. అయితే ఇంతలోపే సమీపంలోనే ఉన్న పోలీసులు రియాజ్ను పట్టుకున్నారు. కానిస్టేబుల్ హత్యపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఎట్టిపరిస్థితుల్లోనూ నిందితుడిని వదలొద్దు అంటూ అధికారులను ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా రియాజ్ కోసం గాలింపు ఉదృతం చేశారు. అయితే రియాజ్ ఏపీ రాష్ట్రానికి పారిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ రియాజ్ మాత్రం అక్కడక్కడే పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నట్లుగా తాజా ఘటనతో స్పష్టమైంది. ఎట్టకేలకు రియాజ్ పట్టుబడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలను చేస్తున్న నిందితుడు షేక్ రియాజ్ ఆచూకీ సమాచారం లభించిన వెంటనే పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్య చేశాడు. నిజామాబాద్ సిసిఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు ప్రమోద్. హత్య ఘటనపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. మల్టీ జోన్ _1 ఐజిపి శ్రీ చంద్రశేఖర్ రెడ్డిని సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు.