ఆన్‌లైన్ క్లాసుల ప‌ట్ల చిన్నారి ఆశ్ర‌ద్ద‌.. కోపంతో చంపేసిన త‌ల్లి

Mother dies by suicide after suffocating son to death.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్యాసంస్థ‌లు అన్ని మూత ప‌డ్డాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2021 8:38 AM GMT
ఆన్‌లైన్ క్లాసుల ప‌ట్ల చిన్నారి ఆశ్ర‌ద్ద‌..  కోపంతో చంపేసిన త‌ల్లి

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్యాసంస్థ‌లు అన్ని మూత ప‌డ్డాయి. కేవ‌లం ఆన్‌లైన్‌లోనే చ‌దువులు సాగుతున్నాయి. కాగా.. ఈ ఆన్‌లైన్ చ‌దువుల ప‌ట్ల విద్యార్థులు శ్ర‌ద్ద చూప‌డం లేద‌ని, టీచ‌ర్ చెప్పిన పాఠాలు వారికి అర్థం కావ‌డం లేద‌ని పలువురు త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ పిల్ల‌లు చ‌దువుకు దూరం అవుతున్నార‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో ఓ ర‌క‌మైన భావ‌న గూడుక‌ట్టుకుంది. కాగా.. మూడేన్న‌ర ఏళ్ల ఓ చిన్నారి ఆన్‌లైన్ క్లాసుల ప‌ట్ల శ్ర‌ద్ద చూప‌డం లేద‌ని.. తాను చెప్పినట్టుగా చదవడం లేదని..ఓ త‌ల్లి ఆ బాలుడిని చంపేసింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ లో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు నాసిక్‌లోని సాయిసిద్ది అపార్ట్‌మెంట్‌లో శిఖా సాగర్‌(30) అనే మ‌హిళ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల ప్రాంతంలో ఆమె త‌ల్లిదండ్రులు హాలులో కూర్చొగా.. శిఖా త‌న మూడున్న‌రేళ్ల కుమారుడు రిధాన్‌ను తీసుకుని గ‌దిలోకి వెళ్లింది. రిధాన్ ముఖంపై దిండును ఉంచి ఊపిరిఆడ‌కుండా అదిమింది. దీంతో రిధాన్ శ్వాస ఆడ‌క చ‌నిపోయాడు. అనంత‌రం శిఖా ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కూతురు, మ‌నువ‌డు ఇద్ద‌రూ గ‌దిలోకి వెళ్లి చాలాసేపు అయిన బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో శిఖా త‌ల్లిదండ్రులు గ‌ది త‌లుపులు ఎంత‌సేపు కొట్టినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో త‌లుపును ప‌గ‌ల‌కొట్ట‌గా.. రిధాన్ ముక్కు, చెవుల్లోంచి ర‌క్తం కారుతూ బెడ్ పై ప‌డి ఉండ‌గా.. శిఖా ఫ్యానుకు వేలాడుతూ క‌నిపించింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నాస్థ‌లంలో వారికి సూసైడ్ నోటు ల‌భించింది. త‌మ చావుల‌కు ఎవ‌రూ కార‌ణం కాద‌ని అందులో రాసి ఉంది. రిధాన్ ఆన్‌క్లాసుల ప‌ట్ల శ్ర‌ద్ద చూప‌డం లేద‌ని.. అత‌డు ఏమీ నేర్చుకోక‌పోవ‌డంతో.. కోపంలో తాను రాదాన్ ముఖంపై దిండు పెట్టి అద‌మ‌డంతో చ‌నిపోయాడ‌ని రాసుకొచ్చింది. కాగా.. పిల్ల‌లపై ఒత్తిడి తేవొద్ద‌ని, అలాగే.. వారి చ‌దువుల విష‌యంలో మానసిక ఇబ్బందులకు గురవ్వద్దొని పోలీసులు చెబుతున్నారు.

Next Story