దారుణం.. ప్రియురాలిని మొబైల్‌ ఛార్జర్‌ వైరుతో గొంతు నులిమి చంపేశాడు

మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో 22 ఏళ్ల యువకుడు తన ప్రియురాలిని కిరాతకంగా హతమార్చి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన...

By -  అంజి
Published on : 5 April 2026 9:56 AM IST

Chandrapur Murder Case, Mobile Charger Wire Strangling, Live-in Relationship Crime, Postmortem Report Confirms Homicide, Ankesh Yogesh Bahirwar Arrest,Staged Suicide Investigation, Maharashtra Police Crime News, Domestic Dispute Murder

దారుణం.. ప్రియురాలిని మొబైల్‌ ఛార్జర్‌ వైరుతో గొంతు నులిమి చంపేశాడు

మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో 22 ఏళ్ల యువకుడు తన ప్రియురాలిని కిరాతకంగా హతమార్చి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 14వ తేదీ రాత్రి జరిగిన ఈ దారుణం, పోస్ట్‌మార్టం నివేదిక రావడంతో 20 రోజుల తర్వాత అసలు నిజం బయటపడింది. నిందితుడు అంకేష్ యోగేష్ బహిర్వార్ (22)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మృతురాలు ప్రియాంక వాంధర్, తన భర్తకు దూరంగా ఉంటూ అంకేష్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ ప్రియాంక ఇంటి పై అంతస్తులో సహజీవనం చేస్తున్నారు.

పోలీసుల విచారణ ప్రకారం, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అంకేష్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదని ప్రియాంక ఆంక్షలు విధించడం, అంకేష్ ప్రవర్తనను నియంత్రించాలని చూడటం ఈ గొడవలకు ప్రధాన కారణమని తెలిసింది. మార్చి 14న రాత్రి 8 గంటల సమయంలో గొడవ ముదరడంతో, ఆగ్రహానికి లోనైన అంకేష్ సెల్ ఫోన్ ఛార్జర్ వైరుతో ప్రియాంక గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఆమె తండ్రికి ఫోన్ చేసి, ప్రియాంక స్పృహ తప్పి పడిపోయిందని, బహుశా ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని నమ్మబలికాడు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

తొలుత అందరూ దీనిని ఆత్మహత్యగానే భావించారు. అయితే, ఏప్రిల్ 3న అందిన పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె గొంతు నులిమి చంపబడినట్లు స్పష్టమైంది. దీని ఆధారంగా పోలీసులు అంకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన మొబైల్ ఛార్జర్ మరియు ఎక్స్‌టెన్షన్ బోర్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.

Next Story