మధ్యప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల యువతి, గుజరాత్కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై సూరత్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి, చివరికి పోలీసు కేసు వరకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం, మధ్యప్రదేశ్కు చెందిన మోన (పేరు మార్చబడింది), రాజ్కోట్ జిల్లా వీర్పూర్కు చెందిన రాజ్ (పేరు మార్చబడింది) అనే మైనర్ బాలుడికి సుమారు ఏడాదిన్నర క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ కాలంలో వారు క్రమం తప్పకుండా మాట్లాడుకుంటూ, తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
కాలక్రమేణా వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారి, జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల బాలుడు కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో విచారణ చేపట్టగా, వీరిద్దరూ సూరత్లో ఉన్నట్లు గుర్తించారు. మైనర్ బాలుడిని అపహరించినట్లు యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.