హైదరాబాద్‌లో అంధ బాలికపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  26 July 2024 1:07 AM GMT
hyderabad, rape,  eight years, blind girl ,

 హైదరాబాద్‌లో అంధ బాలికపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు 

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. బాత్‌రూమ్‌లు కడిగేందుకు వచ్చి హాస్టల్‌లోఉన్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో అస్వస్థతకు గురి అయ్యింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు హాస్టర్ నిర్వాహకులు ప్రయత్నించారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో.. అమ్మాయి ఆరోగ్యం బాగోలేందంటూ వికారాబాద్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. ఇక చివరకు తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చి ఆమెతో మాట్లాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో, బాలిక తల్లిదండ్రులు హాస్టల్‌ నిర్వాహకులను నిలదీశారు. ఆ తర్వాత తమ కూతురుపై అత్యాచారం జరిగిందని మలక్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. బాలిక అంధురాలు కాబట్టి.. బాలిక చెప్పిన మాటలు నమ్మలేం.. ఊరికి తీసుకెళ్లి వైద్యం చేయించండి అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. చేసేదేమీ లేక తల్లిదండ్రులు బాలికను వికారాబాద్‌ తీసుకెళ్లి అక్కడి ఆస్పత్రిలో చూపించారు. ఎంతకీ రక్తస్రావం ఆగకపోవడంతో హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన నీలోఫర్‌ వైద్యులు.. బాలికపై అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు.. మలక్‌పేట పోలీసులకు కూడా సమాచారమిచ్చారు. నీలోఫర్‌ వైద్యులు చెప్తే కానీ పోలీసుల్లో కదలిక రాలేదు. ఈనెల 16న పోక్సో కేసు నమోదు చేశారు.

ఘటన జరిగిన 15 రోజుల తర్వాత కానీ.. కామాంధుడు నరేష్‌ను అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. ఘటనపై మలక్‌పేట పోలీసులు విచారణ జరుపుతున్నారని దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజేందర్‌ ఓ ప్రకటన చేసి చేతులుదులుపుకున్నారు. మరో వైపు తోటి విద్యార్థినికి జరిగిన అఘాయిత్యంతో హాస్టల్‌లో ఉండే ఇతర విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story