హైదరాబాద్లో దారుణం.. భోజనం కోసం గొడవ.. డ్రైవర్ను చంపిన వంటమనిషి!
హైదరాబాద్లోని కోకాపేటలో శనివారం రాత్రి (మార్చి 28, 2026) జరిగిన దారుణ హత్య కలకలం రేపింది.
By - అంజి |
హైదరాబాద్లో దారుణం.. భోజనం కోసం గొడవ.. డ్రైవర్ను చంపిన వంటమనిషి!
హైదరాబాద్లోని కోకాపేటలో శనివారం రాత్రి (మార్చి 28, 2026) జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ఒక విల్లాలో వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి, కేవలం భోజనం వడ్డించే విషయంలో తలెత్తిన వివాదంతో డ్రైవర్ను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోకాపేటలోని నార్త్ స్టార్ అల్లూరా విల్లాస్ లో కట్రగుంట ధర్మతేజ అనే వ్యక్తి కుటుంబం గత నాలుగు నెలలుగా నివసిస్తోంది. అక్కడ షేక్ బాషా (43) వంటవాడిగా పనిచేస్తూ సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటున్నాడు. కాగా, పీనుమల్ల కార్తీక్ (24) అనే యువకుడు సుమారు 15 రోజుల క్రితమే అక్కడ డ్రైవర్గా చేరాడు.
శనివారం రాత్రి 11:45 గంటల సమయంలో, ఇంట్లో ధర్మతేజ వదిన మాత్రమే ఉన్న సమయంలో బాషా, కార్తీక్ మధ్య భోజనం వడ్డించే విషయంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్తా హింసాత్మకంగా మారడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన బాషా వంటగదిలోని కత్తితో కార్తీక్పై దాడి చేశాడు. కార్తీక్ శరీరంలో పలుచోట్ల తీవ్రమైన గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు షేక్ బాషాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతుడు కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.