భార్యను హత్య చేసి సూట్‌కేసులో ప్యాక్‌ చేసి..

Husband arrested in Software employee murder case.ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏమైందో ఎమో తెలీదు కానీ.. భార్య‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2021 6:01 AM GMT
భార్యను హత్య చేసి సూట్‌కేసులో ప్యాక్‌ చేసి..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏమైందో ఎమో తెలీదు కానీ.. భార్య‌ను దారుణంగా హ‌త మార్చాడు. సూట్‌కేసులో శ‌వాన్ని ప్యాక్ చేసి నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకువెళ్లి క‌న్న‌బిడ్డ క‌ళ్లెదుటే మృత‌దేహాన్ని కాల్చేశాడు. అనంత‌రం డెల్టాఫ్ల‌స్ క‌రోనాతో చికిత్స పొందుతూ భార్య మృతి చెందింద‌ని.. మృత‌దేహాన్ని కూడా ఆస్ప‌త్రి వారు ఇవ్వ‌లేద‌ని భార్య త‌రుపు బంధువుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. అత‌డు చెప్పిన మాట‌ను నిజ‌మేన‌ని అంద‌రూ న‌మ్మారు. అయితే.. మృతురాలి అక్క కుమారై అనుమానంతో సీసీ కెమెరా పుటేజీ ప‌రిశీలించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రామసముద్రానికి చెందిన భువనేశ్వరి (27)ని రెండున్నరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భువ‌నేశ్వ‌రీ హైద‌రాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. క‌రోనా కార‌ణంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేస్తూ తిరుప‌తిలోని ఓఅపార్టుమెంట్లో భ‌ర్త‌తో క‌లిసి ఉంటోంది. శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు.

కాగా.. ఈ నెల 22 నుంచి భువ‌నేశ్వ‌రీ ఫోన్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో పుట్టింటి వారికి అనుమానం వ‌చ్చి భ‌ర్త శ్రీకాంత్ రెడ్డి నిల‌దీశారు. భువ‌నేశ్వ‌రికి డెల్టాఫ్ల‌స్ వేరియంట్ క‌రోనా సోక‌డంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్లు.. అక్క‌డ ఆమె చ‌నిపోవ‌డంతో త‌న‌కూ చూపించ‌కుండా ద‌హ‌న‌క్రియ‌లు చేసిన‌ట్లు చెప్పి వారిని న‌మ్మించారు. అయితే.. భువ‌నేశ్వ‌రి అక్క కుమారై మ‌మ‌త క‌ర్నూలు జిల్లాలో ట్రైనీ ఎస్ఐగా ప‌నిచేస్తోంది. ఆమె భువ‌నేశ్వరి ఉంటున్న అపార్టుమెంట్ సీసీ కెమెరా పుటేజీల‌ను తిరుప‌తి పోలీసుల స‌హ‌కారంతో ర‌హ‌స్యంగా ప‌రిశీలించారు.

ఈ నెల 22న ఉద‌యం కుమారైను తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లిన శ్రీకాంత్ రెడ్డి ఎర్ర‌టి సూట్‌కేసుతో వ‌చ్చాడు. మ‌ధ్యాహ్నం అదే సూట్‌కేసును లాక్కొంటూ కుమారైను ఎత్తుకుని ట్యాక్సీ ఎక్కిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో క‌నిపించాయి. ఆ త‌రువాత అత‌ను రుయా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలోని సెంట్ర‌ల్ డ్ర‌గ్ స్టోర్స్ స‌మీపంలోకి వెళ్లిన‌ట్లు గుర్తించారు. అక్క‌డ స‌మీపంలోని పొద‌ల చాటున సూట్‌కేసును తెరిచి మృత‌దేహాన్నికాల్చేశాడు. ఆ స‌మ‌యంలో అత‌డి భుజం పై కుమారై ఉంది. అలిపిరి పోలీసులు ట్యాక్సీడ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌డంతో ఈ విష‌యాల‌ను నిర్థారించాడు. ఈ హత్యకేసులో భర్త శ్రీకాంతరెడ్డిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళ్తుండగా నెల్లూరు వద్ద శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story