మీ పిల్లలను మోడలింగ్ లోకి పంపిస్తామని చెప్పి.. ఘరానా మోసం

How failed actors cheated a man of Rs 14L on pretext of launching his daughter.యాడ్ ఫిల్మ్‌లలో మీ పిల్లలను మోడల్‌గా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jan 2023 7:36 AM GMT
మీ పిల్లలను మోడలింగ్ లోకి పంపిస్తామని చెప్పి.. ఘరానా మోసం

యాడ్ ఫిల్మ్‌లలో మీ పిల్లలను మోడల్‌గా చూపుతామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు నటులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పూణేకు చెందిన 47 ఏళ్ల అపూర్వ అశ్విన్ దావ్డా అలియాస్ అర్మాన్ అర్జున్ కపూర్ అలియాస్ డాక్టర్ అమిత్ అలియాస్ అర్జున్ కపూర్, అతని 26 ఏళ్ల భార్య నటాషా కపూర్ అలియాస్ నాజీష్ మెమన్ అలియాస్ ముంబైకి చెందిన మేఘనగా గుర్తించారు. మోడలింగ్ కోసం పిల్లలను ఎంపిక చేసి, ప్రముఖ సినీ నటులు, క్రికెటర్లతో కలిసి యాడ్స్‌లో నటించే అవకాశం కల్పిస్తామనే సాకుతో వీరిద్దరూ ప్రముఖ మాల్స్‌లో ర్యాంప్ షోలు నిర్వహించినట్లు సైబర్ పోలీసులు తెలిపారు. వారు తమ వెబ్‌సైట్ www.cosmopolitanmodels.co.inలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

నిందితులు పలు ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు పిల్లల తల్లిదండ్రులను ఒప్పించేవారు. కాస్ట్యూమ్స్, ఇతర ఉపకరణాలు మొదలైనవాటి కోసం ఈ డబ్బులని.. ఇదంతా తిరిగి ఇచ్చేస్తామని అది డిపాజిట్ సొమ్మని చెబుతూ ఉండేవారు. జనవరి 4, 2023న, మదీనాగూడకు చెందిన గోపాలకృష్ణన్ కృష్ణానంద్ నుండి పోలీసులకు ఫిర్యాదు అందింది, అతను తన కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడానికి డిసెంబర్ 11, 2022న తన కుటుంబంతో కలిసి కొండాపూర్‌లోని శరత్ క్యాపిటల్ మాల్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు. కాస్మోపాలిటన్ మోడల్స్ ఏజెన్సీ (వెబ్‌సైట్: www.cosmopolitanmodels.co.in) పిల్లల మోడల్‌లను ఎంచుకోవడానికి ర్యాంప్ వాక్ నిర్వహిస్తోంది. మీకు ఆసక్తి ఉందా అని ఫిర్యాదుదారుని అడిగారు. మొబైల్ నంబర్ తీసుకుని వాట్సాప్ లో కూపన్ కోడ్ షేర్ చేశారు. అప్పుడు వారు అతని కుమార్తె చిత్రాన్ని పంచుకోవాలని కోరారు. తర్వాత ర్యాంప్‌పై నడవమని చెప్పి ఫొటోలు తీశారు.

వారి వెబ్‌సైట్‌లో వివిధ ప్రకటనలు, ఫ్యాషన్ షోలు మొదలైన వాటి కోసం 20 మంది చైల్డ్ మోడల్‌లను ఎంపిక చేయడానికి భారతీయ నగరాలను సందర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 17, 2022లో ఫైనల్ ఆడిషన్ నిర్వహిస్తున్నట్లు మేఘన నుండి అతనికి వాట్సాప్ సందేశం వచ్చింది. పిల్లలు ఎరుపు రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. డిసెంబరు 17న, ఫిర్యాదుదారుడి కుమార్తె ర్యాంప్‌పై నడిచింది. అదే రాత్రి అతని కుమార్తె మోడలింగ్‌కు ఎంపికైనట్లు వారికి వాట్సాప్ సందేశం వచ్చింది. ప్యాకేజీని ఎంచుకోవాలని వారు తల్లిదండ్రులను కోరారు. మేఘన వారితో మాట్లాడి, వారి హెడ్ డాక్టర్ అమిత్ కాల్ కోసం వేచి ఉండమని కోరింది. అనంతరం బ్యాంకు ఖాతాల్లో ఆన్‌లైన్‌లో డిపాజిట్లు చేయాలని కోరారు.

డిసెంబర్ 20న అమిత్ అతనితో మాట్లాడి మీ కూతురు ఓరియో బిస్కెట్ యాడ్‌కి ఎంపికైందని, ఆమె ప్రమోషనల్‌లో రష్మిక మందన్నతో కలిసి పనిచేస్తుందని తెలియజేశారు. ప్రముఖ డిజైనర్ రీతూ కుమార్ అందించే కాస్ట్యూమ్స్ కోసం రూ.3,25,000 డిపాజిట్ చేయాలని ఫిర్యాదుదారుని కోరారు. తరువాత, వారు 6 రోజుల పాటూ ఫోటో షూట్ చేయబోతున్నామని ఫిర్యాదుదారుని నమ్మించారు. తన కుమార్తెను మోడలింగ్‌కు ఎంపిక చేస్తానన్న సాకుతో అతడి నుంచి రూ.14,12,000 వసూలు చేశారు. ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో సిసిపిఎస్ పోలీసులు నిందితులను హైదరాబాద్‌లో పట్టుకున్నారు.

నిందితుడి నేపథ్యం:

అపూర్వ అశ్విన్ ముంబై నగరానికి చెందినవాడు. అతను 1998లో లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేసాడు. ఆ తర్వాత అతను భారతదేశానికి వచ్చి ఇరవై సంవత్సరాలు మోడల్‌గా తన వృత్తిని కొనసాగించాడు. తరువాత అతను విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. బాలీవుడ్‌లో ‘ఓం’, ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే రెండు సినిమాల్లో నటించాడు. అవకాశాలు కరువవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ మధ్యే బాలీవుడ్‌లో చైల్డ్ మోడలింగ్ స్కామ్‌ను మొదలుపెట్టాడు. తక్కువ వ్యవధిలో చాలా మంది భారీగా డబ్బు సంపాదిస్తున్నారని భావించి.. చైల్డ్ మోడలింగ్ పేరుతో చాలా మంది అమాయకుల నుండి భారీ మొత్తంలో కాజేశాడు. అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసు రాడార్‌ నుండి బయటకు రావాలని.. తన పేరును అపూర్వ అశ్విన్ దావ్డా నుండి అర్మాన్ అర్జున్ కపూర్‌గా మార్చుకున్నాడు. మోడలింగ్ రంగంలో పనిచేస్తున్న నాజీష్ ఇక్బాల్ మెమన్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమె పేరును నటాషా కపూర్ అలియాస్ నాజీష్ అపూర్వ మెమన్ గా మార్చాడు. అతడి నేరాలకు ఆమె కూడా సహకరించింది.

మోడలింగ్ పేరుతో కస్టమర్లను మోసం చేసేందుకు నిందితుడు వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. మోడల్‌లను ఎంపిక చేసుకునేందుకు మాల్స్‌లో క్యాట్‌వాక్‌లు నిర్వహించేవాడు. వారు వాట్సాప్‌లో మాల్ మేనేజర్‌ని సంప్రదించి ర్యాంప్ వాక్ కోసం అనుమతి తీసుకునేవారు. ర్యాంప్ వాక్ షోలకు ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులను నియమించుకునేవారు. వారికి చక్కని జీతాలు ఇస్తానని మాట ఇచ్చేవాడు.

ప్రజలను ఆకర్షించడానికి మాల్ లోపల వ్యక్తుల కాంటాక్ట్ నంబర్‌లను తీసుకొని, వారి పిల్లలను ర్యాంప్‌పై నడిచేలా చేస్తామని హామీ ఇచ్చేవారు. బాధితులకు కూపన్ కోడ్ అందించి వారం రోజుల పాటు వేచి ఉండాలని అడుగుతారు. ఆ తర్వాత నిందితులు వారి పిల్లలు ఎంపికైనట్లు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పేవారు. ఆ తర్వాత ప్యాకేజీ ఛార్జీలు, దుస్తులు, మేకప్ కిట్.. వంటి వాటికి డిపాజిట్ అని చెబుతూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి.. తర్వాత ఫోన్లు స్విచాఫ్ చేసేవారు. ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు.. 15.60 లక్షల నగదు, నాలుగు యాపిల్ మొబైల్ ఫోన్లు, ఒక యాపిల్ ల్యాప్‌టాప్, 3 ఎయిర్‌టెల్ సిమ్ కార్డులు, రెండు ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story