నంద్యాల జిల్లాలో పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి.. తల, మొండెం వేరు చేసి

వివాహానికి ముందే మ‌రో అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి, పెళ్లి త‌రువాత ఇంటికి వ‌చ్చి తిరిగి కాపురానికి వెళ్ల‌లేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2023 3:57 AM GMT
నంద్యాల జిల్లాలో పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి.. తల, మొండెం వేరు చేసి

ఇటీవ‌ల కాలంలో ప‌రువు హ‌త్య ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. కూతురు లేదా కొడుకు చేసిన త‌ప్పుల కార‌ణంగా స‌మాజంలో త‌మ ప‌రువు పోయింద‌ని బావిస్తున్న కొంద‌రు త‌ల్లిదండ్రులు అప్ప‌టి వ‌ర‌కు అల్లారు ముద్దుగా పెంచుకున్న వారిని క‌డ‌తేర్చేందుకు వెనుకాడ‌డం లేదు. వివాహానికి ముందే మ‌రో అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి, పెళ్లి త‌రువాత ఇంటికి వ‌చ్చి తిరిగి కాపురానికి వెళ్ల‌లేదు. కూతురి కార‌ణంగా ఊళ్లే త‌లెత్తుకోలేక‌పోతున్నాన‌ని బావించిన తండ్రి ఆమెను దారుణంగా హ‌త‌మార్చాడు. మృత‌దేహాం త‌ల, మొండాన్ని వేరు చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న నంద్యాల జిల్లా పాణ్యం మండ‌లంలో చోటు చేసుకుంది.

ఆల‌మూరు గ్రామంలో దేవేంద్రరెడ్డి త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. త‌న పెద్ద కూత‌రు ప్ర‌స‌న్న‌(21)కు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో రెండు సంవ‌త్స‌రాల క్రితం పెళ్లి చేశాడు. భ‌ర్త‌తో ప్ర‌స‌న్న హైద‌రాబాద్‌లో కాపురం చేస్తోంది. అయితే.. పెళ్లికి ముందే ప్ర‌స‌న్న మ‌రో యువ‌కుడిని ప్రేమించింది. అత‌డితో సాన్నిహిత్యం కార‌ణంగా ఇటీవ‌ల హైద‌రాబాద్ నుంచి గ్రామానికి వ‌చ్చింది. తిరిగి భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వెళ్లలేదు.

భ‌ర్త వ‌ద్ద‌కు వెళ్లాల‌ని తండ్రి ఎంత‌గా న‌చ్చ‌జెప్పిన‌ప్ప‌టికి అత‌డి మాట విన‌లేదు. కూతురు వ‌ల్ల గ్రామంలో త‌న ప‌రువు పోయింద‌ని దేవేంద్రరెడ్డి బావించాడు. దీంతో ప్ర‌స‌న్న‌పై కోపం పెంచుకున్నాడు. ఫిబ్ర‌వ‌రి 10న ఇంట్లో ఉన్న కూతురి గొంతు నులిమి హ‌త్య చేశాడు. మ‌రికొంద‌రి సాయంతో కారులో నంద్యాల- గిద్దలూరు మార్గంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్క‌డ అత్యంత దారుణంగా త‌ల, మొండాన్ని వేరు చేశాడు. త‌ల‌ను ఓ చోట‌, మొండాన్ని మ‌రో చోట ప‌డేశాడు. అనంత‌రం ఏమీ ఎర‌గ‌న‌ట్టు ఇంటికి వ‌చ్చేశాడు. అయితే.. త‌ర‌చుగా ఫోన్ చేసే మ‌న‌వ‌రాలు ఇటీవ‌ల అస్స‌లు ఫోన్ చేయ‌క‌పోవ‌డంతో తాత శివారెడ్డికి అనుమానం వ‌చ్చింది. మ‌నవ‌రాలు ఏమైంద‌ని దేవేంద్రరెడ్డి ని కాస్త గ‌ట్టిగానే అడిగాడు.

అస‌లు విష‌యాన్ని చెప్పేశాడు. దీంతో శివారెడ్డి పోలీసుల‌ను ఫిర్యాదు చేశాడు. గురువారం దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్ర‌స‌న్న మృత‌దేహం ప‌డేసిన ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్క‌డ మృత‌దేహం కోసం వెతుక‌గా దొర‌క‌లేదు. శుక్ర‌వారం మ‌రోసారి ఆ ప్రాంతం అంతా గాలించ‌గా త‌ల‌, మొండెం దొరికాయి. పోస్టుమార్టం కోసం వాటిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story