గుజరాత్లోని బనస్కాంత జిల్లా కర్బున్ గ్రామంలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు రణఛోడ్ జీ దర్బార్ తన భార్య ధర్మిబాతో కలిసి నివసించేవాడు. అయితే, అదే గ్రామానికి చెందిన భానాభాయ్ మాజీరానాతో ధర్మిబాకు ఉన్న అక్రమ సంబంధం గురించి భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను వదిలించుకోవాలని ధర్మిబా పథకం రచించింది. ఇందులో భాగంగా తన ప్రియుడు, తన సోదరి ఆనందబాతో కలిసి కుట్ర పన్నింది. ఘటన జరిగిన రాత్రి, ధర్మిబా తన భర్త తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది.
భర్త స్పృహ తప్పి పడిపోయిన తర్వాత, ఆమె ప్రియుడు మాజీరానా గొడ్డలితో దాడి చేసి అతడిని అక్కడికక్కడే హతమార్చాడు. హత్య చేసిన తర్వాత నిందితులు మృతదేహాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో, అది సహజ మరణంగా నమ్మించేందుకు మృతదేహాన్ని తిరిగి మంచం మీద పడుకోబెట్టారు. అయితే, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. పోలీసులు ఈ కేసును ఛేదించి భార్య ధర్మిబా, ఆమె ప్రియుడు, ఆమె సోదరిని అరెస్ట్ చేశారు. వీరిపై హత్య, నేరపూరిత కుట్ర మరియు ప్రోత్సాహం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.