తొలి రాత్రే వ‌ధువుకు షాక్‌

Groom cheats bride by hiding his impotence.వివాహం అనంత‌రం జీవితం పై ఆ యువ‌తి ఎన్నో క‌ల‌లు క‌న్నది. పైగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2021 3:08 AM GMT
తొలి రాత్రే వ‌ధువుకు షాక్‌

వివాహం అనంత‌రం జీవితం పై ఆ యువ‌తి ఎన్నో క‌ల‌లు క‌న్నది. పైగా ఎన్ఆర్ఐ సంబంధం. అనుకున్న‌ట్లే పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. తొలి రాత్రి శోభ‌నం గదిలోకి అడుగుపెట్టిన ఆ యువ‌తికి ఊహించ‌ని షాక్ ఇచ్చాడు ఆమె భ‌ర్త‌. అత‌డు సంసారానికి ప‌నికి రాడ‌ని, న‌పుంస‌కుడని తెలిసి త‌ల ప‌ట్టుకుంది ఆ యువ‌తి. పైగా అదనపు కట్నం తెస్తే కాపురానికి తీసుకెళతానని భార్య, ఆమె తరఫు వారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఇటీవల దాడికి సైతం పాల్పడ్డాడు. దీంతో న్యాయం చేయాలంటూ ఆ యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన 20 ఏళ్ల యువతికి విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ప్రైవేటు కన్సల్టెన్సీలో పనిచేసే యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన తెనాలిలో వివాహం జరిగింది. పెళ్లి కొడుకు త్వరలో చదువు కోసం కెనడా వెళతాడని, అక్కడే పార్ట్‌ టైం ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటాడని, పెళ్లి చేసుకుని భార్యనూ తీసుకెళతాడని వరుడి తల్లిదండ్రులు చెప్పారు. వీసా, ఇతర పత్రాలన్నీ చూపించడంతో వధువు తల్లిదండ్రులు మంచి సంబంధం అని చెప్పి సుమారు రూ.10 లక్షల కట్నం, ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి అమ్మాయి తరపు వారు వివాహం చేశారు.

వివాహం అనంతరం కొత్త జంట విజయవాడలోని వరుడి ఇంటికి వెళ్లింది. అక్కడ శోభనం ఏర్పాట్లు చేశారు. మంచి భ‌ర్త దొరికాడ‌ని, భ‌విష్య‌త్‌పై కోటి ఆశ‌ల‌తో శోభ‌నం గ‌దిలోకి అడుగుపెట్టిన న‌వ వ‌ధువుకు ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది. తాను నపుంసకుడినని, సంసారానికి పనికిరానని భ‌ర్త చెప్పడంతో షాక్‌కు గురైంది. బయట ఎవరికీ చెప్పవద్దని ప్రాధేయపడ్డాడు. మరుసటి రోజు విజయవాడలో వరుడి తల్లిదండ్రులు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. రిసెప్షన్‌కు వచ్చిన తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు వధువు అసలు విషయం చెప్పుకుని భోరున విలపించింది. దీంతో వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను తెనాలిలోని పుట్టింటికి తీసుకొచ్చేశారు.

అనంతరం పెద్ద‌ల స‌మ‌క్షంలో పంచాయ‌తీ పెట్టారు. రిసెప్షన్‌ కోసం తాము రూ.8 లక్షలు ఖర్చు పెట్టామని, వాటిని తిరిగి ఇవ్వాలని యువకుడు, అతని తరఫు వారు డిమాండ్‌ చేశారు. దీనిపై బాధిత యువ‌తి తెనాలి త్రీ టౌన్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్ఐ ఎం.విజ‌య్‌కుమార్ తెలిపారు.

Next Story