Medak: చెరువులో పడ్డ బాలుడిని కాపాడబోయి నలుగురు మృతి

చెరువులో పడిన బాలుడిని కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలతో పాటు బాబు కూడా ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  25 Sep 2023 11:15 AM GMT
Four died, boy, pond, medak, three women,

 Medak: చెరువులో పడ్డ బాలుడిని కాపాడబోయి నలుగురు మృతి

మెదక్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడిన బాలుడుని కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలతో పాటు బాబు కూడా ప్రాణాలు కోల్పోయారు. దాంతో.. ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌ మండలం రంగయ్యపల్లి గ్రామంలో చెరువు వద్ద నీటిలో స్నానానికి దిగాడు. అయితే.. ఉన్నట్లుండి బాబు నీటిలో మునిగిపోతుండటాన్ని అక్కడే ఉన్న ఒక మహిళ గమనించింది. దాంతో.. ఆ బాలుడిని రక్షించేందుకు అని నీటిలోకి దిగింది. ప్రమాదవశాత్తు ఆ మహిళ కూడా నీటిలో మునిగిపోవడం మొదలైంది. కాగా.. బాబుతో పాటు మహిళ నీటిలో మునుగుతుండటాన్ని మరో ఇద్దరు మహిళలు గమనించారు. దాంతో.. వెంటనే అప్రమత్తమైన వారిని బయటకు తీసుకొచ్చేందుకు చెరువులోకి దూకారు. అలా బాబుని కాపాడాలని మహిళ.. బాబుతో పాటు మహిళను కాపాడాలనుకుని మరో ఇద్దరు మహిళలు నీళ్లలోకి దూకారు. ప్రమాదవశాత్తు నలుగురు చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో రంగయ్యపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. నీటిలో మునిగిపోయిన నలుగురు మృతదేహాలను వెలికి తీశారు. ఒకేరోజు నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నలుగురూ వేర్వేరు కుటుంబాలకు చెందినవారుగా సమాచారం. వారివారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Next Story