విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Engineering student dies in Suspicious Conditions.ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2021 2:12 AM GMT
విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ప‌శ్చిమ‌గోదావ‌రిజిల్లా న‌ర‌సాపురం మండ‌లం తెడ్లం గ్రామానికి చెందిన మున్ని(21) విజ‌య‌వాడ‌లో ఇంజినీరింగ్ చ‌దువుతోంది. క‌రోనా కార‌ణంగా ఇంటి ద‌గ్గ‌రే ఉంటూ ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతోంది. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి చెందిన త‌రుణ్ తెడ్లంలో ఉంటున్న సోద‌రి ఇంటికి గ‌తేడాది వ‌చ్చి.. అక్క కుటుంబానికి చెందిన ఈ సేవ కేంద్రంలో ప‌నిచేసేవాడు.

ప్రాజెక్టు ప‌ని మీద మున్ని త‌ర‌చుగా అక్క‌డికి వెళ్లేది. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌కు దారితీసింది. కాగా.. ఈ నెల‌లో ప‌రీక్ష‌లు ఉన్నాయ‌ని విజ‌య‌వాడ‌కు వ‌చ్చింది మున్ని. ఖాళీగా ఉండ‌డం ఎందుకు అని టెలీకాల‌ర్‌గా ప‌ని చేస్తోంది. అదే సంస్థ‌లో త‌రుణ్ కూడా చేరాడు. అన్నా, చెల్ల‌ళ్ల‌మ‌ని వీరిద్ద‌రు గుణ‌ద‌ల ప్రాంతంలో ఈ నెల 6న ఓ గ‌దిని అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 23న మున్నికి ఫోన్‌కు ఆమె పాత స్నేహితుడు మిస్ట్‌కాల్ ఇచ్చాడు. ఆమె ఫోన్ ప‌రిశీలించిన త‌రుణ్‌.. అత‌డితో ఎందుకు మాట్లాడుతున్నావ‌ని వాగ్వాదానికి దిగాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి త‌రుణ్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు.

మున్ని గ‌దిలోప‌లికి వెళ్లి త‌లుపులు వేసుకుంది. అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన ఇంటి య‌జ‌మాని.. త‌లుపు కొట్టాడు. ఎంత‌సేపు అయినా ఆమె త‌లుపు తీయ‌క పోవ‌డంతో అనుమానం వ‌చ్చి కిటికీలోంచి చూడ‌గా.. ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతూ క‌నిపించింది. వెంటనే త‌లుపులు ప‌గ‌ల కొట్టి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిని మున్ని సోమ‌వారం మ‌ధ్యాహ్నాం మృతి చెందింది. త‌రుణ్ ఆమెను కొట్టి చంపాడ‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.మృతురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story