తనపై తప్పుడు ఫిర్యాదు చేస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ డయాలసిస్ టెక్నీషియన్ సూసైడ్ చేసుకున్నాడు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్న సుధాకర్ ఆసుపత్రి ఆవరణలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రి ఆవరణలోని వాటర్ ప్లాంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆదివారం నాడు పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుష్మిత తెలిపారు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఆమె తెలిపారు.
బాధితుడు సుధాకర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక ల్యాబ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆసుపత్రిలోని కొంతమంది సిబ్బంది వేధింపుల కారణంగా సుధాకర్ మరణించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ దొరికింది. ఏరియా ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో కొందరు అతనిని వేధిస్తున్నారని, గత కొంతకాలంగా అధికారుల చుట్టూ తిరిగి విసుగు చెందిన సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
బాధలో ఉన్నవారు లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారు సహాయం కోసం '100' కు డయల్ చేయవచ్చు.