కర్ణాటకలోని శివమొగ్గలో ఘోరం జరిగింది. తన కళ్లముందే స్నేహితుడిపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన పదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల సదరు విద్యార్థి పాఠశాలలో స్పెషల్ క్లాస్ ముగించుకుని బయటకు వస్తుండగా, బయట కొంతమంది స్థానిక యువకుల మధ్య గొడవ జరుగుతుండటం గమనించాడు. తనకి తెలిసిన ఒక అబ్బాయిపై కొందరు దాడి చేస్తుండటంతో, వారిని వారించి గొడవను సద్దుమణిగేలా చేసేందుకు ఆ విద్యార్థి ప్రయత్నించాడు. అయితే, ఆగ్రహానికి గురైన ఆ యువకులు విద్యార్థిపైనే దాడికి దిగారు.
అతని ఛాతీపై బలంగా దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన మరో బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. శివమొగ్గ ఎస్పీ నిఖిల్ తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన వారు, మరణించిన విద్యార్థి ఒకే ప్రాంతానికి చెందిన వారని, వారు ఒకే పాఠశాలలో చదువుకున్నారని తెలిపారు. ఒక చిన్న వివాదమే ఈ ఘర్షణకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్.ఎన్. చెన్నబసప్ప మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.