దేశ రాజధాని ఢిల్లీలోని మంగోల్పురిలో ఒక ఒళ్లు గగుర్పొడిచే హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల మహిళను ఆమె 22 ఏళ్ల ప్రియుడు అతి క్రూరంగా హత్య చేసి, మృతదేహాన్ని పీజీ (PG) గదిలోని బెడ్ స్టోరేజ్ బాక్స్లో దాచిపెట్టాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రియుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు మరియు బాధితురాలు మంగళవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో మంగోల్పురిలోని ఒక పేయింగ్ గెస్ట్ వసతి గృహానికి వచ్చారు. అయితే, వచ్చిన గంట వ్యవధిలోనే నిందితుడు గది నుంచి ఒంటరిగా బయటకు వెళ్లడం చూసిన యజమానికి అనుమానం కలిగింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు గదిని తనిఖీ చేయడంతో బెడ్ బాక్స్లో కుక్కి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది.
ప్రాథమిక విచారణలో బాధితురాలిని అత్యంత క్రూరంగా హింసించి చంపినట్లు తేలింది. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయని, నుదుటిపై లోతైన గాయంతో పాటు గొంతు నులిమిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆమెను బంధించి, దుప్పటితో ఊపిరాడకుండా చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో దీపక్ (22), సురేందర్, జోగిందర్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.