అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి, వారంలో నాలుగో మరణం

అగ్రరాజ్యంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు.

By Srikanth Gundamalla  Published on  2 Feb 2024 7:14 AM GMT
indian student, died,  america,

 అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి, వారంలో నాలుగో మరణం 

చాలా మంది విద్యార్థులు తమ చదువులను విదేశాల్లో కొనసాగించాలనీ.. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించుకుని మిగతా జీవితాన్ని గడపాలని చూస్తారు. ఇదే లక్ష్యంగా చిన్నప్పటి నుంచే పెట్టుకుని ఆ దిశగా ముందుకెళ్తారు. అయితే.. తాజాగా అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవర పెడుతున్నాయి. అగ్రరాజ్యంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారం రోజుల్లోనే నలుగురు విద్యార్థులు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల నీల్‌ ఆచార్య అనే విద్యార్థి తన యూనివర్సిటీలోనే చనిపోగా.. తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్‌ రెడ్డి చనిపోయాడు.

శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి అనే విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో మృతదేహాలు కనిపించాయి. శ్రేయాస్‌ రెడ్డి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా.. శ్రేయాస్ లిండర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో చదువుతున్నట్లు సమాచారం. అతడి మరణంపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది.

ఇటీవలే అమెరికాలో మరో ముగ్గురు భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వివేక్‌ సైని (25) అనే భాతర విద్యార్థిని నిరాశ్రయుడైన ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి.. దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్కనర్‌ అనే వ్యక్తికి సైనీ సాయం కూడా చేశాడు. కానీ.. ఫాల్క్‌నర్ సైనీనే చంపేశాడు.

మరో చోట ఫర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారత విద్యార్థి నీల్‌ ఆచార్య గత వారం తన యూనిర్సిటీలోనే శవమై కనిపించాడు. జాన్‌ మార్టినన్సన్ హానర్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫర్డ్యూ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌ చేస్తున్నారు నీల్‌ ఆచార్య. ముందుగా తన తల్లి కొడుకు కనిపించట్లేదని తెలిపింది. కానీ.. కాసేపటికే అతని మృతదేహాన్ని గుర్తించారు.

మరో భారత విద్యార్థి సిన్సినాటి యూనివర్సిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఒహియోలోని కారులో అతన్ని దుండగులు కాల్చి చంపేశారు. మరో కేసులో ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న అకుల్‌ ధావన్‌ను కూడా అక్కడే మృతిచెందాడు.


Next Story