మణిపూర్లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సహాయక శిబిరంలో (Relief Camp) నివసిస్తున్న ఏడేళ్ల చిన్నారి అదృశ్యమైన 24 గంటల్లోనే శవమై కనిపించడం ఆ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మోరే ప్రాంతానికి చెందిన ఈ బాలిక ఆదివారం సాయంత్రం కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
నిందితుడిని లైష్రామ్ లంగ్గాంబా (28)గా గుర్తించారు. నిందితుడు కూడా అదే సహాయక శిబిరంలో ఉంటున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో అతను చిన్నారిని అపహరించి, లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు అంగీకరించాడు. అనంతరం మృతదేహాన్ని సింగ్జామే ప్రాంతంలోని ఒక వంతెన కింద పడేసినట్లు వెల్లడించాడు. నిందితుడి సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఇరిల్బంగ్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. మణిపూర్ శిశు హక్కుల పరిరక్షణ కమిషన్ మరియు శిశు సంక్షేమ కమిటీ సభ్యులు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.