ఆ యువతులు ఎంతో సంతోషంగా విహారయాత్రకు వచ్చారు. అయితే ఆ యాత్రే వారికి చివరిదైంది. తాజాగా సెల్ఫీ తీసుకుంటూ వాటర్ ఫాల్స్లో జారిపడిన ఐదుగురు యువతుల్లో నలుగురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కితవాడ జలపాతంలో జారి పడి నలుగురు యువతులు మృతి చెందారు. మృతులు ఉజ్వల్ నగర్కు చెందిన ఆసియా ముజావర్ (17), అనగోలాకు చెందిన కుద్షియా హస్మ్ పటేల్ (20), రుక్కాషర్ భిస్తీ (20), జత్పత్ కాలనీకి చెందిన తస్మియా (20) అని తెలిసింది.
బెళగావిలోని బషేబాన్ హైస్కూల్కు చెందిన 40 మంది యువతులు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులోని కితవాడ జలపాతానికి విహారయత్రకు వెళ్లారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుంటుండగా ఐదుగురు యువతులు జలపాతంలో జారిపడిపోయారు. యువతులు నలుగురు నీట మునిగి చనిపోయారు. మృతి చెందిన నలుగురు యువతుల మృతదేహాలను బెళగావిలోని బీఐఎం ఆస్పత్రికి తరలిస్తున్నారు. బిమ్స్ ఆస్పత్రి దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తే చేస్తున్నారు.