విషాదం.. ఆలయంలో ఇద్దరు యువతులు ఆత్మహత్య.. 'ఎలా చనిపోవాలి అని AIని అడిగి..'
గుజరాత్లోని సూరత్ నగరంలో జరిగిన ఓ విషాదకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నప్పటి స్నేహితులైన ఇద్దరు...
By - అంజి |
విషాదం.. ఆలయంలో ఇద్దరు యువతులు ఆత్మహత్య
గుజరాత్లోని సూరత్ నగరంలో జరిగిన ఓ విషాదకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నప్పటి స్నేహితులైన ఇద్దరు యువతులు ఒక ఆలయ ప్రాంగణంలో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. సూరత్లోని దిండోలి ప్రాంతానికి చెందిన రోష్ని (18), జ్యోత్స్న (20) ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ కాలేజీకి వెళ్తున్నామని చెప్పి మార్చి 6న ఉదయం 7 గంటలకు ఇళ్ల నుంచి బయలుదేరారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. దిండోలిలోని ఆత్మీయ సంస్కార్ ధామ్ స్వామినారాయణ ఆలయం వద్ద వారి స్కూటర్ కనిపించడంతో లోపలికి వెళ్లి వెతకగా, అక్కడి వాష్రూమ్ తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది.
తలుపులు పగులగొట్టి చూడగా, ఇద్దరు యువతులు స్పృహ తప్పి పడి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఘటనా స్థలంలో అనస్థీషియా ఇంజెక్షన్లు, సిరంజిలు, విషం ఉన్నట్లు అనుమానిస్తున్న కొన్ని సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా మందును శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకోవడం వల్లే వారు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సిసిటీవీ ఫుటేజీల ప్రకారం, వారు ఉదయం 7:30 గంటల సమయంలో వాష్రూమ్లోకి వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు వారు తమ మొబైల్ ఫోన్లలో గూగుల్, చాట్ జిపిటి ద్వారా "ఆత్మహత్య ఎలా చేసుకోవాలి?", "ఏ మందులు వాడాలి?" అనే అంశాలపై శోధించినట్లు పోలీసులు గుర్తించారు. వారి ఫోన్లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నీరవ్ సింగ్ గోహిల్ తెలిపారు.