కృష్ణవంశీ స్టార్ట్ చేసేశాడుగా.. ఇంతకీ ఎవరితో..?
By Newsmeter.Network Published on 26 Nov 2019 6:29 AM GMTక్రియేటివ్ డైరెక్టర్ అనగానే ఠక్కున గుర్తుకువచ్చే పేరు కృష్ణవంశీ. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు అందించారు. ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అయితే... 2016లో సాయిధరమ్ తేజ్తో కృష్ణవంశీ నక్షత్రం అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దాంతో కృష్ణవంశీని ఎవరూ పట్టించుకోలేదు.
దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన సినిమాని తెరకెక్కిస్తుండటం విశేషం. ఇంతకీ.. కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న సినిమా ఏంటంటే... 'రంగమార్తాండ'. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్'కు ఇది రీమేక్. ఈ సినిమా అధికారికంగా చిత్రీకరణను ప్రారంభించింది. కృష్ణవంశీ స్నేహితుడు ప్రకాశ్రాజ్, కృష్ణ వంశీ సతీమణి, ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు.
కాగా.. సీనియర్స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇందులో హృదయాన్ని పిండేసే ఓ పాత్రలో నటించబోతున్నాడు. ఆయనకు సంబంధించిన లుక్ కూడా ఇప్పటికే విడుదలైంది. 'రంగస్థలం'లో రంగమత్తగా మెప్పించిన అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటించనుంది. మిగిలిన వారి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు దర్శకుడు తేజ గౌరవ దర్శకత్వం వహించాడు. అంతఃపురం తర్వాత కృష్ణవంశీ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం.