మహిళల భద్రతపై హైదరాబాద్ సీపీ సమీక్ష సమావేశం
Published on 5 Dec 2019 11:00 AM GMT
మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సంబంధిత అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో మహిళల భద్రత రక్షణపై హైద్రాబాద్ సీపీ అంజనీ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యాబ్ సర్వీస్ నిర్వహకులతో సీపీ , ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ సమావేశమయ్యారు. మహిళల భద్రత కోసం క్యాబ్ నిర్వాహకులు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. క్యాబ్ నిర్వాహకులు డయల్ 100 కు కాల్స్ అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్యాబ్ లలో మహిళా భద్రత కోసం ఉన్న యాప్ లను డిస్ ప్లే చేసేలా క్యాబ్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి సూచిచారు. ప్రతి రెండు, మూడు రోజులు ఒకసారి డ్రైవర్ల ప్రవర్తన పై కస్టమర్ల ఫీడ్ బాక్ తీసుకోవాలని సీపీ అంజనీ కుమార్ క్యాబ్ డ్రైవర్లకు సూచించారు. క్యాబ్ లలోమహిళలు ప్రయాణించిన సమయంలో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తించరాదని, మహిళలపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కటకటాల పాలవుతారని హెచ్చరించారు. నగరంలో క్యాబ్ డ్రైవర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో 15 క్యాబ్ సర్వీస్ సంస్థలు పాల్గొన్నాయి.