ఇవి నిజమేనా..? కరోనా వ్యాప్తిలో వస్తున్నఅనుమానాలపై నిజాలు వెల్లడించిన పరిశోధకులు

By సుభాష్  Published on  24 May 2020 3:10 PM GMT
ఇవి నిజమేనా..? కరోనా వ్యాప్తిలో వస్తున్నఅనుమానాలపై నిజాలు వెల్లడించిన పరిశోధకులు

కరోనా వైరస్‌.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ దాదాపు 200లకుపైగా దేశాల్లో తిష్టవేసి పట్టిపీడిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. ఇక భారత్‌లో కూడా పట్టిపీడిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే కరోనాపై అనేక అపోహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కరోనాతో ఎంతో మంది అనుమానాలతోనే టెన్షన్ పడిపోతున్నారు. ఏపీలో మాత్రం రోజురోజుకు విజృంభిస్తుండగా, తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టి ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అధిక సంఖ్యలో నమోదువుతున్నాయి. ఈ వైరస్‌పై ఇప్పటికే ఎంతో మంది వైద్యులు, ఎంతో మంది తగు సూచనలు, జాగ్రత్తలు సూచించారు. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే వైరస్‌ రాకుండా ఉండేందుకు, అలాగే వైరస్‌ వచ్చినా తగ్గుతుందని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కరోనా వైరస్‌ అంటే ఏమిటీ..?

కరోనా వైరస్‌ మానవునిలో ఇంతకుముందెన్నడు గుర్తించలేదు. చైనాలోని వుహాన్‌లో మొట్టమొదటి సారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న చైనాలో ఇప్పటి వరకు వేలాదిగా మరణించారు.

వెల్లుల్లి తింటే కరోనా వైరస్‌ తగ్గుతుందా..?

వెల్లుల్లి తింటే కరోనా తగ్గుతందని వాట్సాప్‌లలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటివి నమ్మవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉడికించిన వెల్లుల్లి నీటిని ఒక గ్లాస్‌ తాగడం వల్ల వైరస్‌ సంక్రమణకు చికిత్స చేయవచ్చని ఉంది. అయితే వెల్లుల్లిలో యాంటీమైక్రోబయాల్‌ లక్షణాలతో ఉన్నప్పటికీ ఇది కరోనా వైరస్‌ను చంపుతుందన్నగ్యారంటి లేదు. అంతేకాకుండా ఈ వైరస్‌ను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి మెడిసన్‌ సిఫారసు చేయనేలేదు. ఇప్పటికే కరోనాను తరిమికొట్టేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాయి.

​చైనా వస్తువులు కొంటే కరోనా వస్తుందా..?

చైనా నుంచి వచ్చే వస్తువులను స్వీకరిస్తే కరోనా వస్తుందని వార్తలు వ్యాపిస్తున్నాయి. మొబైళ్లు, ఇంకేదైనా వస్తువులు ఆన్‌లైన్‌లో గానీ, ఇతర ఫ్లాట్‌ఫాంల ద్వారా చైనా నుంచి వచ్చిన వస్తువులు తీసుకోవడం వల్ల వైరస్‌ సోకుతుందని పలువురు చెబుతుండగా, ఈ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. చైనా నుంచి వచ్చే ఏ వస్తువులు గానీ తీసుకున్న క్రమంలో వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఏ మాత్రం లేవని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.

చైనీస్‌ ఫుడ్‌ తింటే కరోనా వస్తుందా..?

చైనాలో ఈ వైరస్‌ వ్యాపించిన తర్వాత దేశ వ్యాప్తంగా పాకుతోంది. దాదాపు 200లకుపైగా వ్యాపించింది. ఈ వైరస్‌ వల్ల సోషల్ మీడియాలో రకరకాలుగా తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. చైనీస్‌ రెస్టారెంట్లు, చైనీస్‌ ఫుడ్‌ తింటే ఈ వైరస్‌ వ్యాపిస్తుందని పుకార్లు వ్యాపిస్తున్నాయి. కాకపోతే ఈ ఫుడ్‌ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ వీటి వల్ల కరోనా వ్యాపిస్తుందనడంలో ఎలాంటి నిజాలు లేవు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు.అంతేకాదు చైనీస్‌ ఫుడ్‌ తింటే ఈ వైరస్‌ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించలేదు. ఇష్టమైన నూడుల్స్‌, ఇతర చైనీస్‌ ఫుడ్‌ తినడం వల్ల ఈ వైరస్‌ రాదని నిపుణులు చెబుతున్నారు.

శీతలపానీయాలతో...

ఇక సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం అవుతున్నదానిలో ఇదొకటనే చెప్పాలి. ఐస్‌క్రిమ్‌, కుల్ఫీ, శీతలపానీయాల పాటు గడ్డకట్టిన ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్‌ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. అంతేకాదు చల్లని ఆహార పదార్థాల ద్వారా ఈ వైరస్‌ వస్తుందని ఎక్కడ ప్రకటించలేదు.

ఉప్పు నీటితో వైరస్‌ను కట్టడి చేయవచ్చా..?

ఇక ఇప్పునీటితో కరోనా వైరస్‌ను కట్టడి చేయవచ్చని వస్తున్న వందతులను సైతం వుహాన్‌ యూనాని ఆస్పత్రి, అకాడెమిషియన్‌ జాంగ్స్‌ బృందం కొట్టి పారేసింది. ఈ వైరస్‌ చికిత్సకు ఉప్పు నీరు ఉపయోగపడుతుందని వస్తున్న పుకార్లను ఖండించింది. ఈ పుకార్లన్ని తప్పుడు వార్తలేనని, ఇందులో వైద్య శాస్త్రంగా ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.

పెంపుడు జంతువులతో కరోనా వ్యాపిస్తుందా..?

పెంపుడు జంతువులతో కరోనా వైరస్‌ వస్తుందని వస్తున్న వదంతులపై ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లేవు. పెంపుడు జంతువులను ముట్టుకున్న సందర్భంలోమన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు వైద్యని పుణులు. అంతే తప్ప జంతువుల ద్వారా కరోనా వస్తుందనడం పచ్చి అబద్దమని పరిశోధకులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌కు చికిత్స ఉందా..?

కరోనా వైరస్‌ సోకిన తర్వాత నివారణ చర్యలేమైనా ఉన్నాయా? అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు వైద్యులు. ప్రస్తుతానికి కరోనా చికిత్సకు మెడిసిన్‌ ఏదీ లేదు. ఇంకా వ్యాక్సిన్‌ ప్రయోగ దశలో ఉంది కాని, పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. పరిశోధనలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కరోనాను అరికట్టాలంటే భౌతిక దూరం, పలు జాగ్రత్తలు పాటించడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటికే ఇలాంటి సూచనలు, సలహాలు వైద్యులతో పాటు ప్రభుత్వాలు సైతం ప్రచారం చేశాయి.

Next Story