కరోనా రాజకీయాలు..ఇదేం బుద్ధి అంటున్న ప్రతిపక్షాలు

By రాణి  Published on  5 April 2020 6:17 AM GMT
కరోనా రాజకీయాలు..ఇదేం బుద్ధి అంటున్న ప్రతిపక్షాలు

కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీని కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు పోషణ కరువైంది. ఇలాంటి వారికి అన్నం పెట్టేందుకు.. నిత్యావసరాల కోసం కేంద్రం నిధులు కేటాయించింది. వాటిలోనే ఆంధ్రప్రదేశ్ కు రూ.1050.91 కోట్ల నిధులను కేటాయించింది. వీటిలో రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.491.41 కోట్లు, కరోనా విపత్తు సహాయనిధి కింద రూ.559.50 కోట్ల నిధులు. విపత్తు సహాయనిధి కింద వచ్చిన రూ.559.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. కేంద్రం చెప్పినట్లుగా ప్రతి ఇంటికి రూ.1000 నిత్యావసరాల కోసం ఇస్తున్నారు బాగానే ఉంది. కానీ ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సింది గ్రామ వాలంటీర్లు కదా. ఆ బాధ్యతలను ఈసారి వాలంటీర్లకు ఇవ్వలేదు. స్వయంగా వైసీపీ కార్యకర్తలు, పంచాయతీ ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులు పంచిపెడుతున్నారు..అది కూడా జగనన్న ఇచ్చాడని చెప్తూ. నిజానికి జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ప్రకటించిన నిధులు శూన్యం. కేంద్రం ప్రకటించిన రూ.1000 నే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్తున్నారు.

Also Read : భయంగా ఉంది.. విధులు నిర్వహించలేం.. !

సందట్లో సడేమియా అన్నట్లు.. ఇదిగో ఇవి జగనన్న ఇచ్చిన డబ్బులు. పంచాయతీ ఎన్నికల్లో మీరంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైసీపీని గెలిపించాలంటూ పార్టీ తరపున ప్రచారం కూడా చేసేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై సదరు ప్రచార కర్తలు ఎదురు తిరుగుతున్నారు. మా ఇష్టం..మాకిష్టమొచ్చినట్లు ఇస్తాం..మీరెవరు అడగడానికి అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలా ఏదో ఒక చోటే జరిగింది అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి.

ఇదీ వరుస. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ తో పాటుగా తెల్లరేషన్ కార్డుదారులందరికీ నిత్యావసరాల కోసం రూ. 1000 ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాతే కేంద్రం కరోనా సహాయనిధుల గురించి ప్రకటన చేసింది. అంటే మొత్తం రూ.2000 ఇవ్వాలి. మరి కేంద్రం ఇచ్చిన డబ్బులనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కేంద్రం ఇచ్చిన రూ.1000, రాష్ట్ర ప్రభుత్వం రూ.500 మొత్తం రూ.1500 ఇచ్చారు. ఏపీలో పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన మేలేంటి ? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతుంది.

Also Read : లాక్‌డౌన్‌ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?

నిజమే..కష్టకాలంలో కూడా వైసీపీ ఇంత నీచమైన రాజకీయాలకు తెరలేపడం సరికాదు. కరోనా కారణంగానే ఎన్నికలను వాయిదా వేశామని ఆనాడు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంత చెప్పినా వినకుండా..ప్రతిపక్ష పార్టీ కావాలనే వాయిదా వేయించిందని ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో 226 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంకా ఎంతమందికి కరోనా సోకి ఉందో తెలియని దీన స్థితిలో ఉంది. అధికార పార్టీ మాటలు విని షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే..ఈ సంఖ్య 5 అంకెలకు మించిపోయినా ఆశ్చర్య పడక్కర్లేదు.

'' సంక్షోభంలో కూడా స్వార్థ నీచ రాజకీయమా ? కరోనావ్యాప్తితో దేశం,రాష్ట్రం తీవ్రఇబ్బందిలో ఉన్న ఈపరిస్థితుల్లో విపత్తునిర్వహణ కోసం కేంద్రం ఇచ్చిననిధులను సొంతనిధులుగా స్టిక్కర్ వేసి వాలంటీర్లతో కలిసి వైసీపీకార్యకర్తలు తమపార్టీ ఇస్తున్నట్లు పంచడం చాలాదారుణం. బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. '' అని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ట్వీట్ చేశారు.



Next Story