కరోనా ఇన్సూరెన్స్ పాలసీ.. పాజిటివ్ అయితే రూ.2 లక్షలు
By అంజి Published on 4 March 2020 10:55 AM GMTఢిల్లీ: చైనాలో వేల మంది చావుకు కారణమైన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే 88 దేశాలకు వ్యాపించింది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా భారతదేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 28కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అలర్ట్ అయ్యాయి. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. తాజాగా కరోనాకు ఒక పాలసీ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిందని సమాచారం.
భారతదేశానికి చెందిన ఓ ఇన్సూర్ టెక్ స్టార్టప్ డిజిట్ ఇన్సూరెన్స్ తాజాగా ఈ పాలసీని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చిందని ఓ వెబ్సైట్ తన కథనంలో రాసింది. ముందు జాగ్రత పడేవారు ఈ పాలసీని తీసుకోవచ్చు. కంపెనీ ఏజెంట్ పోర్టల్లో కరోనా వైరస్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం రూ.299 నుంచి ప్రారంభం అవుతుంది. కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ అయితే.. 100 శాతం ఇన్సూరెన్స్ డబ్బులను పాలసీ చెల్లిస్తుందని. ఒక వ్యక్తి రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు బీమా చేయడానికి ఈ పాలసీ తీసుకోవచ్చు.