కరోనా ఎఫెక్ట్: ఆన్లైన్లో వైద్య విద్య
By అంజి
ఇప్పుడంటే కరోనా వల్ల గానీ మాములుగా చాలా అంశాలలో చైనా దేశం ప్రసిద్ధి. జనాభా, పనితనం అలాగే వైద్య విద్యలలో కూడా చైనా ఎప్పుడు ప్రత్యేకంగానే నిలిచేది. చైనాలో వైద్య విద్యకు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్నది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరిశోధనా రంగానికి చైనా వైద్య వర్సిటీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. చైనాలో వైద్య విద్యను అభ్యసించేందుకు లక్షలాది మంది విదేశీ విద్యార్థులు ఇక్కడి వర్సిటీలను ఆశ్రయిస్తుంటారు.
ప్రస్తుతం కరోనా వైరస్ అక్కడ భయంకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య విద్యార్థుల కోసం ఆన్లైన్లో ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసినట్టు చైనా వర్సిటీలు ప్రకటించాయి. మెడిసిన్ విద్యార్థులు తమ ఇండ్ల వద్ద నుంచే ఆన్లైన్లో ప్రత్యేక కోడ్ ద్వారా యాక్సిస్ అయ్యే అవకాశం కల్పించినట్టు తెలిపాయి. చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళనలు నెలకొన్నాయి.
చాలా వర్సిటీలు విద్యార్థులకు సెలవులు ప్రకటించగా కరోనా భయంతో వేలాది మంది విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఈనెల 7 నుంచి తరగతులు పున: ప్రారంభం అవ్వాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల పాటు సెలవులు పొడిగించినట్టు వర్సిటీలు తెలిపాయి. అంతేగాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించడంతో పాటు సెమిస్టర్లకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నాయి.
చైనా వర్సిటీలు తమ విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యల పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చైనాలో మెడిసిన్ అభ్యసిస్తున్న విద్యార్థులకు 100 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థులను డిటెండ్ చేస్తారు. ఓ వైపు కరోనా వైరస్ ఆందోళనతో పాటు మరోవైపు వర్సిటీలో తరగతులకు హాజరుకాకుంటే డిటెండ్ అవుతామనే భయం మెడికోల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆన్లైన్లో తరగతులకు హాజరయ్యేందుకు చైనా వర్సిటీలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. కరోనా వైరస్ నిర్మూలన కోసం జిన్పింగ్ సర్కారు పటిష్ట చర్యలు చేపడుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రత్యేక వైద్య బృందాలు చైనాకు చేరుకున్నాయి. కరోనా వైరస్ నిర్మూలన కోసం చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనంతో పాటు విస్తృత పరిశోధనలు చేపడుతున్నాయి.