ఏపీలో కరోనా లెక్కలపై రాజకీయ రగడ

By సుభాష్  Published on  16 April 2020 7:22 AM GMT
ఏపీలో కరోనా లెక్కలపై రాజకీయ రగడ

ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. ఇక కరోనా లెక్కల విషయంలో ఏపీలో రాజకీయ రగడ రగిలిపోతోంది. ముఖ్యంగా ప్రతిపక్షమైన టీడీపీ అధికార పార్టీ వైసీపీపైనా, ముఖ్యమంత్రి జగన్‌పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. అలా రగడ జరగడంతో ఏపీలో ఏం జరుగుతుందోననే వాదన తెరపైకి వచ్చింది.

అయితే ఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్నన్నప్పటికీ ప్రభుత్వం దాచిపెడుతూ బయటకు పొక్కనివ్వడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. కేవలం ఒకటి, రెండు ప్రాంతాలకు మాత్రమే కరోనా వైరస్‌ పరిమితం చేసి, మిగిలిన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ దాచిపెడుతోందని ఆరోపిస్తోంది. కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తున్న వైసీపీ సర్కార్‌ అమరావతిలోనే ఎక్కువ ఉందని, విశాఖలో ఏమి లేదన్నట్లుగా చెబుతోందని టీడీపీ విమర్శిస్తోంది. అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తన్న జగన్‌ సర్కార్‌ దీనికి అనుగుణంగానే హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేస్తోందని టీడీపీ మండిపడుతోంది. విశాఖను రాజధాని చేయ్యాలనే ఉద్దేశంతో అక్కడ వైరస్‌ లేదన్నట్లుగా మాట్లాడుకొస్తుందోని పేర్కొంది.

ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కూడా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న విషయం తెలిసింఏద. అదే సమయంలో విశాఖ విషయానికొస్తే అక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు పెద్దగా లేవనే విషయం వాస్తవం. ఈ నేపథ్యంలో టీడీపీ దీనిని అదనుగా చేసుకుని జగన్‌ ప్రభుత్వంపై నిందలు వేసే కుట్ర చేస్తోందనే వాదన బలంగా కనిపిస్తోంది.

గుంటూరు విషయానికొస్తే..

ఇక గుంటూరు విషయానికొస్తే ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ కు వెళ్లిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందులో భాగంగానే వైసీపీ ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందని ఓ వ్యక్తి కూడా మర్కజ్‌కు వెళ్లగా, ఆ వ్యక్తితో పాటు ప్రజాప్రతినిధిని కూడా 14 రోజుల పాటు క్వారంటైన్‌ను తరలించిన సంగతిని టీటీపీ గుర్తు చేస్తోంది.

మరో వాదన

ఇక ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌ కరోనా కేసుల సంఖ్యను తగ్గించి చెప్పారని టీడీపీ మరో వాదనను తెరపైకి తీసుకొచ్చింది. కానీ జగన్‌ మాత్రం అబద్దాలు చెప్పకుండా నిజంగా కేసుల వివరాలు మోదీతో వెల్లడించారని వైసీపీ నేతల మాట. మోదీ సమావేశం జరిగినప్పటి వరకూ.. ముఖ్యమంత్రి జగన్‌కు అందిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 382 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఈ లెక్కలే మోదీకి వివరించారు. ఇక మోదీ సమావేశం జరిగిన ఓ రెండు గంటల తర్వాత అంటే సాయంత్రానికి ఆ సంఖ్య 402కి చేరింది. ఇందులో తేడా 22 కేసులు. దీంతో ఈ 22 కేసులు దాచి మోదీకి వివరించారన్నది టీడీపీ ఆరోపణ.

ఇక విశాఖ విషయానికొస్తే..

ఇక విశాఖ విషయానికొస్తే అక్కడ పెద్దగా కరోనా పాజిటివ్‌ కేసులు లేవు. పెద్దగా మర్కజ్‌కు వెళ్లివారు కూడా లేరు. ముందుగా విశాఖలోనే ఎక్కువ కరోనా కేసులు ఉంటాయనుకున్నా.. క్రమ క్రమంగా కట్టడి చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల ద్వారానే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇలా కరోనా రాకముందు కూడా రాజకీయ రగడ సృష్టిస్తే.. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా టీడీపీ, వైసీపీ మధ్య వార్‌ కొనసాగుతోంది.

Next Story