ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపటం కష్టం: సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌

By Newsmeter.Network  Published on  21 Nov 2019 4:46 PM GMT
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపటం కష్టం: సమీక్షా సమావేశంలో  సీఎం కేసీఆర్‌

ముఖ్యాంశాలు

  • ఆర్టీసీపై ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం
  • ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయం
  • రూ.5వేల కోట్ల నష్టంలో ఆర్టీసీ
  • ఆర్టీసీ తక్షణం చెల్లించాల్సిన అప్పలు రూ.2వేల కోట్లు
  • ఆర్టీసీలో 2,600 కాలం చెల్లిన బస్సులు
  • రెండేళ్లుగా చెల్లించని రవాణా బకాయిల పన్ను
  • పీఎఫ్ బకాయిల కింద నెలకు రూ.65 -70 కోట్లు
  • యధావిధిగా ఆర్టీసీని నడపటం సాధ్యం కాదని నిర్ణయం

హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్.టి.సి.) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృత చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్నా కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్య అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్ల రూపాయలు కావాలి. సిసిఎస్ కు రూ.500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. డీజిల్ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పిఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపురూ. రూ.65-70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుంది? అనేది ప్రధాన ప్రశ్న.

ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది.ఈ పరిస్థితులతో పాటు రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో చర్చ జరిగింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ఎజి ప్రసాద్,అడిషనల్ ఎజి రాంచందర్ రావు, ఆర్టీసీ ఇడిలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Next Story