చిట్యాల కరోనా సెల్ఫీ పాయింట్..

By రాణి  Published on  20 April 2020 4:56 PM GMT
చిట్యాల కరోనా సెల్ఫీ పాయింట్..

కరోనా పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ విధించి సుమారు నెల కావస్తోంది. అయినా ఇంకా రోడ్లపై ఆవారాగా తిరిగే వారి సంఖ్య తగ్గట్లేదు. రోజురోజుకీ రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య పెరిగగిపోతుంది. వారికి బుద్ధి చెప్పేందుకు పోలీసులు వింత వింత శిక్షలేస్తున్నారు. గుంజీలు, గోడకుర్చీ, రోడ్లపై బస్తీలు తీయించడం ఇలా రకారకాలు పనిష్మెంట్లిస్తున్నా ఎలాంటి మార్పు లేదు.

Also Read : కరోనా పై పోరుకు విప్రో భారీ విరాళం..అంతటితో ఆగకుండా..

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయ్ దయచేసి రోడ్లమీదికి రావద్దంటూ కరీంనగర్ లో హారతిచ్చి బొట్టు పెట్టి మరీ చెప్పారు. మీరు చెప్తే మేం వినాలా ? మాకేం కాదన్న ధోరణిలో ఎవరి పని వారిదే అన్నట్లుంది ప్రజల తీరు. ఇలాంటి వారి వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లాఠీ దెబ్బలు తగిలినా మాట వినట్లేదు. ప్రజల తీరుతో విసిగిపోయిన పోలీసులు ఇక లాభం లేదనుకున్నారు. అందుకే నల్గొండ జిల్లా చిట్యాల పోలీసులు అకారణంగా రోడ్లపైకి వచ్చేవారికి వినూత్నమైన శిక్ష విధిస్తున్నారు. చిట్యాల సెంటర్ లో ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. అదేదో లవ్ హైదరాబాద్ లాగా సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే ఫేమస్ అయిపోయే పాయింట్ కాదండోయ్. నేను సమాజానికి అన్యాయం చేస్తున్నానని మనంతట మనమే నలుగురికీ చెప్పుకోవడం. ఇక అక్కడ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టినోడు మళ్లీ రోడ్డుపైకి రావాలంటే కాస్త జంకాల్సిందే.

Also Read : వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం : బిడ్డకు జన్మనిచ్చి మహిళ మృతి

ఆ సెల్ఫీ పాయింట్ అంటూపెట్టిన బ్యానర్ లో '' నేను ఇంట్లో ఉండను. నేను ఎలాంటి కారణం లేకుండా బయట తిరుగుతాను. కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తాను. నేను మూర్ఖున్ని, నేను సామాజిక శత్రువుని.'' అని రాసి ఉంది. ఈ బోర్డు వద్ద సెల్ఫీ తీసుకోవడం అంటే దాదాపు మనల్ని మనం తిట్టుకుంటూ మన గురించి సమాజానికి చెడుగా చెప్పుకోవడమే. ఇంక బుద్ధున్నోడెవ్వడైనా అకారణంగా బయటికి వెళ్లడు.

పైన ఉన్న ఫొటోలో సెల్ఫీలు తీసుకుంటున్న వారంతా అకారణంగా బయటికొచ్చినవారే. అందులోను ఒక కుర్రాడైతే మద్యం షాపులు బంద్ అవ్వడంతో కల్లు కోసం బయటికొచ్చాడంటా. మన పోలీస్ అన్నలు ఊరుకుంటారా ? అతను తెచ్చిన కల్లు బాటిలో ఓ చేతిలో పట్టుకుని అక్కడ సెల్ఫీ దిగేంత వరకూ వదిలిపెట్టలేదు.

Next Story