యాప్స్‌ నిషేధం: భారత్‌ దెబ్బకు స్పందించిన చైనా

By సుభాష్  Published on  30 Jun 2020 11:25 AM GMT
యాప్స్‌ నిషేధం: భారత్‌ దెబ్బకు స్పందించిన చైనా

చైనాకు సంబంధించిన టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు గట్టి షాకివ్వాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్‌ వ్యూహాత్మకంగా చర్యలకు దిగింది. అయితే చైనా యాప్‌లను నిషేధం విధించడంతో చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి ఝావోలిజియన్‌ స్పందించారు. ఈ చర్య తమను తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ప్రకటించారు. పరిస్థితులను సమీక్షిస్తున్నామని, అంతర్జాతీయ, ఆయా దేశాల నియామ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని చైనా కంపెనీలకు చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. భారత్‌ నిబంధనలకు అనుగుణంగా చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడుదారులకు హక్కులు కల్పించాలని, జరిగే నష్టాన్ని బయటపెట్టలేక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు.

తాజాగా ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే యాప్‌లను నిషేధించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం కలవరపెడుతున్న కనబడుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూసీ బ్రౌజర్‌, వుయ్‌చాట్‌, హలో యాప్‌, వుయ్‌ సింక్‌, మై కమ్యూనిటీ, వైరస్‌ క్లీనర్‌, షేర్‌ ఇట్‌తో పాటు చైనాకు సంబంధించిన మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధించింది. ఈ యాప్‌లను ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69-ఎ కింద నిషేధిస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది.

Next Story