నెహ్రూ పుట్టినరోజు నాడే 'చిల్డ్రన్స్ డే' ఎందుకు జరుపుతారు?
By Medi Samrat Published on 14 Nov 2019 10:40 AM GMTఅందరూ అనుభవించే బాల్యం.. నిజంగా వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులకు సూచకంగా బాలల దినోత్సవం(చిల్డన్స్ డే) జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజైన నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం. అయితే.. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను 'చాచా నెహ్రూ' అని ప్రేమగా పిలిచేవారు.
అయితే.. ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే 'బాలల దినోత్సవం' జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు.
కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు.
ఆయన పరిపాలనా కాలంలో కూడా దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు.