భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో రూ. 800

By సుభాష్  Published on  29 March 2020 8:48 AM GMT
భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో రూ. 800

మాంసం ప్రియులకు ఇదీ షాకింగ్‌ న్యూసే. మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. కిలో మటన్‌ ధర రూ.800 నుంచి రూ. 900 వరకు పెరిగింది. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో చికెన్‌, మటన్‌ షాపుల వద్ద జనాలు క్యూ కట్టారు. కనీస దూరం పాటించకుండా జనాలు ఎగబడ్డారు. ఇక కరోనా వైరస్‌ కారణంగా వదంతులు రావడంతో తగ్గుతూ వచ్చిన చికెన్‌ ధర సైతం ఒక్కసారిగా పెరిగిపోయింది. కిలో చికెన్‌ ధర రూ. 180 నుంచి 200 వరకు పెరిగింది.

కరోనా వైరస్‌ కారణంగా చికెన్‌, గుడ్లు తింటే కరోనా వస్తుందని సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో చికెన్, గుడ్లు ధరలు అమాంతంగా పడిపోయాయి. ఎన్నడూ లేని విధంగా హోల్‌సెల్‌గా కిలో చికెన్‌ ధర రూ. 20 నుంచి 40లకు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.50కి రెండు కిలోలున్న కోడిని ఇచ్చినా.. ఎవరూ తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే కరోనా వైరస్‌ భయం. దీంతో కోళ్ల సరఫరా భారీగా తగ్గిపోయింది. ఈ కరోనా వైరస్‌ ప్రభావం చికెన్‌పై భారీగానే పడిందని చెప్పాలి. ఇక చికెన్‌పై వస్తున్న వదంతులపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. చికెన్‌, మటన్‌ తింటే కరోనా వస్తుందని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని, చికెన్‌, గుడ్లూ తింటే శరీరంలో శక్తి పెరుగుతుందని తెలుపడంతో ఇప్పుడు చికెన్‌ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.

Next Story