బాబుకు షాకిచ్చేందుకు సిద్ధమైన సీనియర్‌నేత.. ఎందుకంటే?

By Newsmeter.Network  Published on  13 March 2020 5:32 AM GMT
బాబుకు షాకిచ్చేందుకు సిద్ధమైన సీనియర్‌నేత.. ఎందుకంటే?

తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బ తుగులుతూనే ఉంది. ఆ పార్టీ నుంచి సీనియర్‌ నేతలు వరుసపెట్టి పార్టీని వీడుతున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుండి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలుప్రాంతాల్లో అభ్యర్థులనుసైతం నిలుపుకోలేని పరిస్థితుల్లో టీడీపీ ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆయా జిల్లాల్లో స్థానికంగా టీడీపీ నేతలను నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ నేతలు కొంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీని వీడేందుకు మరో సీనియర్‌ నేతల సిద్ధమవుతున్నట్లు సమచారం.

స్థానిక ఎన్నికల్లో అనుచరులకు అన్యాయం జరిగిందని, టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూల్‌జిల్లాకు చెందిన కేఈ ప్రభాకర్‌ తన అసంతృప్తిని బహిరంగంగానే వెలుబుచ్చుతున్నట్లు సమాచారం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన అనుచరులకు ఎందుకు టికెట్లు కేటాయించలేదని, టికెట్ల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నారంట. ఈ నేపథ్యంలో తన అనుచరులకు న్యాయం చేసుకోలేకుంటే తాను టీడీపీలో కొనసాగడం ఎందుకనే ఆలోచనకు వచ్చినట్లు స్థానికంగా చర్చసాగుతుంది. దీనికితోడు శుక్రవారం ఆయన తన అనుచరులతో సమావేశం అవుతున్నారని, ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారం సాగుతుంది.

మొత్తానికి టీడీపీని అయితే వీడాలని కేఈ ప్రభాకర్‌ నిర్ణయం తీసుకున్నారని ఆయన వర్గీయులు పేర్కొంటుండటం గమనార్హం. కేఈని పార్టీ మారకుండా ఉండేందుకు టీడీపీ ముఖ్యనేతలు సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నించినా కేఈ అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేఈ పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీలోకి వెళ్తారా, వైసీపీలోకి వెళ్తారనే అంశం ఇప్పుడు కర్నూల్‌ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. అనుచరులతో సమావేశం పూర్తయిన అనంతరం కేఈ మీడియాతో మాట్లాడతారని, ఈ సమావేశంలో ఏ పార్టీలోకి వెళ్లేంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Next Story