'ఖైదీ కార్తీ' అని పిలుస్తుంటే థ్రిల్లింగ్గా ఉంది- యాంగ్రీ హీరో కార్తీ
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Oct 2019 11:35 AM GMTయాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్తో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రోజు రోజుకు పెరుగుతున్న ప్రేక్షకాదరణతో ముఖ్యంగా మహిళా ప్రేక్షకాదరణతో ఆల్ సెంటర్స్ హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో బుధవారం సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సక్సస్ మీట్ లో యాంగ్రీ హీరో కార్తి మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్. సినిమాకు ఘన విజయాన్ని అందించారు. నన్ను ఇంతకముందు ఆవారా కార్తీ అనేవారు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళినా ఖైదీ కార్తీ అని పిలుస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. తమిళనాడు, కేరళ, వరల్డ్ వైడ్ సినిమాకు సేమ్ రెస్పాన్స్ వస్తోంది. పండగ ప్రతి ఒక్కరికీ ఇంపార్టెంట్. చాలా రోజుల తర్వాత పండక్కి నా సినిమా విడుదలైంది. హీరోయిన్, పాటలు లేకుండా పండగ సినిమా అంటారేంటి? అని ఎవరైనా అడుగుతారేమోనని అనుకున్నాం.
సినిమా చూస్తే అందరికీ నచ్చుతుందనేది మా కాన్ఫిడెన్స్. ఈ రోజు ప్రేక్షకులు తమకు సినిమా నచ్చిందని చెబుతున్నారు. ‘ఖైదీ’లో యాక్షన్ ఉంది. మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ ఉంది. తండ్రి, కుమార్తె మధ్య ఎమోషన్, సెంటిమెంట్ ఉన్నాయి. ఇటువంటి సినిమా, క్యారెక్టర్ నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక పాప ఉండటంతో క్యారెక్టర్కు బాగా కనెక్ట్ అయ్యాను. దర్శకుడు లోకేష్ తీసిన విధానం, రాసిన విధానం చాలా అద్భుతమని చెప్పాలి. ఒక పక్క లారీలో యాక్షన్ జరుగుతుంటుంది. మరో పక్క ఎస్పీ ఆఫీసులో ఇంకో విషయం జరుగుతుంటుంది. ప్రేక్షకులను ఒక్క నిమిషం కూడా చూపు తిప్పుకోనివ్వకుండా దర్శకుడు సినిమా తీశాడు.