ఏడేళ్ల క్రితం నిర్మించిన భవనాలు కూడా కూల్చేస్తున్నారు..!- పిటిషనర్ తరపు లాయర్
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Oct 2019 3:14 PM GMTహైదరాబాద్ : సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సచివాలయంలో ఉన్న భవనాల కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన చిక్కుడు ప్రభాకర్ వాదించారు. సచివాలయంలో నిర్మాణాలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ న్యాయవాది. సచివాలయ నిర్మాణం, భవనాల కూల్చివేతపై ఇప్పటికే కమిటీ వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవని కోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాది తీసుకెళ్లారు. సరైన పార్కింగ్ కూడా లేదని కోర్టు కు తెలిపారు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను కూడా కోర్ట్ కు సమర్పించారు అడ్వొకేట్ జనరల్.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొనసాగిన సచివాలయాన్ని ఇప్పుడు ఎందుకు కూల్చేస్తున్నారని పిటిషనర్ ప్రశ్నించారు. సచివాలయంలో 7 సంవత్సరాలుక్రితం నిర్మించిన భవనాలను కూడా కూల్చివేస్తున్నారని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. నూతన సచివాలయ నిర్మాణం వలన వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ వాదించారు. రెండు వైపుల వాదనలు విన్న కోర్ట్ విచారణను రేపటికి వాయిదా వేసింది.