బీఎస్-6 వస్తోంది.. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయండి..
By అంజి Published on 15 Feb 2020 11:14 AM GMTఢిల్లీ: బీఎస్-6 ఇంజిన్ వాహనాలు మార్కెట్లోకి వచ్చే సమయం ఆసన్నమవుతోంది. త్వరలోనే బీఎస్-6 ప్రమాణాలు కలిగిన వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ వాహనాల తయారీ సంస్థలను కూడా బీఎస్-6 వాహనాలకు మారిపోవాలని ఆటో మొబైల్ డీలర్ల సంఘం కోరింది. కాగా బీఎస్-4 ఇంజిన్తో కూడిన వాహనాల అమ్మకాల గడువును పెంచబోమని సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే.
అమ్మకాల గడువు పెంచాలని కొరుతూ ఆటోమొబైల్ డీలర్ల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. పిటిషన్ను కొట్టి వేసింది. ఇప్పుడు తప్పనసరిగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయాల్సి వస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. వాహన అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనల అమ్మకాలు.. షోరూమ్లకు కష్టతరంగా మారాయి. మార్చి 31 నాటికి బీఎస్-4 వాహనలను పూర్తిగా అమ్మడం.. కత్తి మీద సామే.
వాహనాలు, వాటి విడిభాగాల తయారీ దారులను పూర్తిగా బీఎస్-6 ప్రమాణాలతోనే తయారు చేయాలని కంపెనీలకు ఆటోమొబైల్ డీలర్ల సంఘం సూచించింది. పూర్తిగా బీఎస్-6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే డీలర్ల వద్దకు పంపాలని, బీఎస్-4 వాహనాల బిల్లంగ్లను ఎవరూ తీసుకోవద్దని సంఘం కోరింది. బీఎస్-4 వాహనాల అమ్మకాల రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆశిష్ కాలే అన్నారు. మార్చి 31, 2020లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.