బ్యూటీషియన్ ఆత్మహత్య

By రాణి  Published on  25 Feb 2020 6:19 AM GMT
బ్యూటీషియన్ ఆత్మహత్య

ఓ బ్యూటీషీయన్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మలక్ పేట పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్ స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం మల్లారెడ్డిగూడెంకు చెందిన ఎలక్ట్రీషియన్ డేవిడ్ రాజ్ కుమార్తె హిమబిందు (22) మూడేళ్లక్రితం బ్యూటీషియన్ కోర్సు నేర్చుకునేందుకు నగరానికి వచ్చింది. అలా నగరానికి వచ్చిన హిమబిందుకు ఆస్మాన్ గఢ్ వెంకటాద్రినగర్ ధాత్రి నిలయంలో ఉండే స్వాతితో పరిచయమైంది.

స్వాతితో పరిచయమైనప్పటి నుంచి హిమ బిందు ఆమెకు బ్యూటీషియన్ హెల్పర్ గా పనిచేస్తూ ఆమె కుటుంబంతోనే ఉంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ..స్వాతి సోదరుడు సాయికిషోర్ ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో స్థానిక పీఎస్ కు ఫోన్ చేసి హిమబిందు ఆత్మహత్యాయత్నం చేసిందని, ఆమెను దిల్ సుఖ్ నగర్ లోని ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు అప్పటికే మృతి చెందిందని చెప్పారని తెలిపారు. వివరాలు తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి హిమబిందు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు పంపించారు. ప్రేమ వ్యవహారమే హిమబిందు ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావించిన పోలీసులు..సాయి కిషోర్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై బాలరాజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story