బ్యాంక్ అప్రైజర్ చేతివాటం.. ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

By Newsmeter.Network  Published on  11 March 2020 4:18 AM GMT
బ్యాంక్ అప్రైజర్ చేతివాటం.. ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

మచిలీపట్నం సెంట్రల్‌ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణం లెక్క ఎంతో తేలింది. పలువురు ఖాతాదారులను, బ్యాంక్‌ అప్రైజర్‌ ప్రసాద్‌ను విచారించిన బ్యాంక్‌ ఉన్నతాధికారులు రూ. 6.71 కోట్ల మేర కుంభకోణం జరిగిందని నిర్దారణకు వచ్చారు. ఈ కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నంకు చెందిన ప్రసాద్‌ సెంట్రల్‌ బ్యాంకులో అప్రయిజర్‌గా పని చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న ప్రసాద్‌ కొంత కాలంగా తన బంధువులు, పరిచయస్తులతో నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవటం మొదలుపెట్టాడు.

బంగారం ఒరిజనలా డూప్లికేటా అనేది తేల్చే బాధ్యత ప్రసాద్‌దే కావడంతో బ్యాంకు అధికారుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న ప్రసాద్‌ కొంతకాలంగా ఇదే తరహాలో బ్యాంకులో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్లలో రుణాలు తీసుకుంటూ వచ్చాడు. సంతకాలు పెట్టిన బంధువులు, పరిచయస్తులకు బ్యాంకు నుంచి నోటీసులు వస్తుండగా ప్రసాద్‌ వారికి మీ రుణాలు తీరిపోయాయి అంటూ చెప్పుకుంటూ రావడంతో పాటు వారి అవసరాలకు అడ్డుపడుతూ నోరు మెదపకుండా చేసుకుంటూ వచ్చాడు.

బ్యాంకు నోటీసులు అధికం కావడంతో అనుమానం వచ్చిన కొంత మంది బ్యాంకు అధికారులతో వాదనకు దిగారు. దీంతో అసలు విషయం బయటికి పొక్కడంతో జరిగిన మోసం తెలుసుకున్న బాధితుల్లోని కొందరు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బ్యాంకు మేనేజర్‌ ను ప్రశ్నించగా.. పైఅధికారులతో మాట్లాడిన అనంతరం ఆడిట్‌ వ్యవహారం ముగిశాక ఫిర్యాదు చేస్తామని వివరించారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన బ్యాంక్‌ ఉన్నతాధికారులు గోల్డ్ లోన్ పెట్డిన వారందరికి పేపర్ ప్రకటన ద్వారా ఆభరణాలను పరిశీలించుకోవాలని కోరారు.

Bank Appraiser Handloom .. Rs. 6.71 Crores Officers

68గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించి ఎవరు రాకపోవడంతో అంతర్గతంగా ఆడిట్‌ చేపట్టిన బ్యాంకు అధికారులు కుంభకోణాన్ని గుట్టురట్టు చేశారు. గత రెండు దశాబ్దాలుగా మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్ లో అప్రైజర్ గా పని చేస్తున్న మాచర్ల సత్యవర ప్రసాద రావు కొంత మంది బ్యాంక్ సిబ్బందితో కలసి ఖాతాదారులకు తెలియకుండా వారి గోల్డ్ లోన్ అకౌంట్ లో నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి భారీ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.

68మందికి చెందిన గోల్డ్ లోన్‌ అకౌంట్ లో మొత్తం రూ. 6 కోట్ల71లక్షల 72వేల 125 బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకంగా లోన్ తీసుకున్నట్లు గుర్తించిన అధికారులు, బ్యాంకు సిబ్బంది గోల్డ్ అప్రైజర్ తో కలసి బంగారు ఆభరణాలు బదులుగా నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకులో పెట్టినట్లు నివేదిక తయారు చేశారు. బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోనున్నారు.

Next Story