బిష్ణోయ్ వణికించినా.. నిలిచి గెలిచిన బంగ్లా టైగర్స్

By అంజి  Published on  10 Feb 2020 3:56 AM GMT
బిష్ణోయ్ వణికించినా.. నిలిచి గెలిచిన బంగ్లా టైగర్స్

కొత్త చాంపియన్‌గా అవతరించిన.. బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల ప్రవర్తన మాత్రం తీవ్ర విమర్శల పాలైంది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఫిల్డీంగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌.. భారత ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే తమ నోటికి పని చెప్పారు. భారత్‌ బ్యాట్స్‌మెన్‌ను అదే పనిగా కవ్విస్తూ.. తిడుతూ కనిపించారు. దీనిపై మ్యాచ్‌ వ్యాఖ్యాతలు కూడా చర్చించారు. బంగ్లా ఆటగాళ్ల తీరుగా బదులిచ్చేందుకు భారత్‌ కొన్నిసార్లు స్లెడ్జింగ్‌ చేశారు. బంగ్లా విజయం అనంతరం మరింత రెచ్చిపోయారు. మైదానంలో భారత ఆటగాళ్లను చూసి వెకిలి చేష్టలు చేశారు. దీనిపై అవార్డు ప్రదానోత్సవంలో బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ను ప్రశ్నిస్తే.. తమ బౌలర్లు కొంత ఉత్సహపడ్డారని, ఇలా జరగడం దురదృష్టకరమని అన్నాడు.

దక్షిణాఫ్రికాలోని ఫోచెస్‌ట్రూమ్‌ వేదికగా జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ లో టీమిండియాకు ఓటమి ఎదురైంది. టైటిల్‌ పోరులో యువ భారత్‌ను వెనకడుగు వేసింది. ఇప్పటికే నాలుగు సార్లు ప్రపంచకప్‌ను కొల్లగొట్టిన భారత్‌ను బంగ్లాదేశ్‌ ఓడించి ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. కాగా మొదటిసారిగా ఐసీపీ ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్‌ అందుకుంది. ఐదోసారి టైటిల్‌ గెలుద్దామనుకున్న భారత్‌ జట్టుకు.. ఫైనల్‌ మ్యాచ్‌లో పరాజయం తప్పలేదు.

టాస్‌నెగ్గిన బంగ్లాదేశ్‌.. మొదటగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే బంగ్లా బౌలర్ల ధాటికి టిమిండియా బ్యాటింగ్‌ కుప్పకూలింది. 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. యశస్వి జైస్వాల్‌ (88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా.. తిలక్‌ వర్మ(38) ఫర్వాలేదనిపించాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ను జైస్వాల్‌, సక్సేనాలు ఆరంభించారు. అయితే 17 బంతులు ఆడిన సక్సేనా రెండు పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. ఆపై తిలక్‌ వర్మతో కలిసి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి రెండో వికెట్‌కు 94 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కెప్టెన్‌ ప్రియాంగార్గ్‌(7), జైస్వాల్‌ ఔటైన తర్వాత ఏ ఒక్కరూ పెద్దగా ప్రభావం చూపలేదు. మధ్యలో జోరెల్‌(22) ఆడుతున్నాడనుకునే సమయంలో అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. భారత్ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 177 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో అవిషేక్‌ దాస్‌ మూడు వికెట్లు సాధించగా, షోరిఫుల్‌ ఇస్లామ్‌, హసన్‌ షకిబ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. రకిబుల్‌ హసన్‌కు వికెట్‌ దక్కింది.

178 పరుగుల లక్ష్యంతో బంగ్లాదేశ్‌ బరిలోకి దిగింది. కాగా 42 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయిన బంగ్లాదేశ్‌ 170 పరుగులు చేసి గెలిచింది. 41 ఓవర్‌లో వర్షం కారణంగా కొద్దిసేపు మ్యాచ్‌ ఆగిపోయింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 46 ఓవర్లకు 170 పరుగులు కుదించారు. బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ 77 బంతుల్లో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు తీశాడు. యశస్వి జైస్వాల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కగా, అక్బర్‌ అలీకి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Next Story