భారత్ బౌలర్ల ధాటికి తలవంచిన బంగ్లా పులులు.!
By Medi Samrat Published on 14 Nov 2019 11:33 AM GMTటీమిండియాతో తో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నేడు ఇండోర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమయ్యింది. అయితే.. టీ20ల్లో ఆకట్టుకున్న బంగ్లా ఆటగాళ్లు తొలిటెస్టులో 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అంతకుముందు పర్యాటక బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు షాద్మన్ ఇస్లాం, ఇమ్రుల్ కయేస్ చెరో ఆరు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు.
అనంతరం క్రీజులోకొచ్చిన మహ్మద్ మిథున్ కూడా 13 పరుగులు చేసి షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. బంగ్లా జట్టులో ముష్ఫికర్ రహీమ్ 43, మోమినుల్ హక్(కెప్టెన్) 37 మాత్రమే పరుగులతో రాణించారు. మిగిలిన వారంతా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీసి రాణించాడు. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్కు తలో రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం మయాంక్, రోహిత్ లతో తొలి ఇన్నింగ్సు మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 14 పరుగుల వద్ద సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. అనంతరం పూజారాతో జతకలిసిన మయాంక్ అచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 30 పరుగులతో, పుజారా 38 పరుగులతో క్రీజులో ఉన్నారు.