బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేడు తుది తీర్పు

By సుభాష్  Published on  30 Sep 2020 2:21 AM GMT
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేడు తుది తీర్పు

దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చేసిన 28 ఏళ్లనాటి బాబ్రీ మసీదు కేసులో లక్నో సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువడనుంది. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు తుది తీర్పు తేదీని ప్రకటించింది. అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కె. యాదవ్ ఈ తీర్పు ఇవ్వనున్నారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ బీజేపీ అగ్రనేతలు ఎల్‌.కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, పార్టీ సీనియర్‌ నేత ఉమా భారతి తదితరులు కోర్టుకు హాజరు కానున్నారు. అయితే 1992 డిసెంబర్‌లో వీరి కుట్ర ఫలితంగానే 15వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని ప్రధాన ఆరోపణ ఉంది.

గత జులై 24న అద్వానీ ఈ కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాంగ్మూలాన్ని ఇచ్చారు. అంతకు ముందు రోజే జోషి కూడా తన వాదనలు వినిపించారు. ఈ కేసులో తమపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, తమ వైపు నుంచి ఎలాంటి తప్పులేదని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సాగుతున్న ఈ కేసు విచారణను నానాటికి ఆలస్యమవుతూ వచ్చింది. పలుమార్లు వాయిదా పడింది. దీంతో విచారణను దాదాపుగా పూర్తి చేసిన సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో నేడు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది.

భారీ భద్రత

మసీదు కూల్చివేత కేసులు సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. కాగా, ప్రస్తుతం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ కేసు విచారణ అనంతరం వచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ మాత్రం తేడా వచ్చినా తిరిగి సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Next Story